
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ సమర్థనీయమని పేర్కొంటూ దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, వర్గీకరణ అవసరమని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతుల్లో ఉప వర్గీకరణ అనుమతించదగినదేనా? అనే అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. మూడు రోజులపాటు వాదనలను విన్న తర్వాత తీర్పును నేడు వెలువరించింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవిందర్ సింగ్ కేసులో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి 2020లో నివేదించింది.
వర్గీకరణ అనుమతించదగినది కాదని ఈవీ చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చెప్పింది.