
- స్టూడెంట్ సూసైడ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: విద్యార్థిని తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ స్టూడెంట్ను తిట్టి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే అభియోగం నమోదైన స్కూల్ హాస్టల్వార్డెన్ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. చెన్నైలో ఓ స్కూల్లో తోటి విద్యార్థి ఫిర్యాదు మేరకు ఆ పాఠశాల హాస్టల్ ఇన్చార్జ్ ఓ స్టూడెంట్ను తిట్టాడు. దీంతో ఆ విద్యార్థి ఒక గదిలో ఉరి వేసుకొని చనిపోయాడు.
ఈ కేసులో ఆ హాస్టల్ ఇన్చార్జ్పై ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఆరోపణలను కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్ఈ కేసును విచారణకు చేపట్టింది.
హాస్టల్ ఇన్చార్జ్ తరఫున అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. హాస్టల్లోని విద్యార్థుల్లో క్రమశిక్షణ, శాంతి, ప్రశాంతతను కాపాడడం కోసం సంరక్షకుడిగా అతడు ఆ స్టూడెంట్ను మందలించాడని పేర్కొన్నాడు. అంతే తప్ప హాస్టల్ ఇన్చార్జ్కు, మరణించిన స్టూడెంట్కు మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని వాదించారు.
వాదనల అనంతరం సుప్రీంకోర్టు బెంచ్.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఈ కేసును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది తాము జోక్యం చేసుకోవడానికి తగిన కేసుగా భావిస్తున్నామని పేర్కొంది. "ఒక విద్యార్థిని తిట్టడం వల్ల ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేరు.
ఆ తిట్లు మరొక విద్యార్థి చేసిన ఫిర్యాదు ఆధారంగా.. సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశించినవి. అటువంటి పరిస్థితిలో ఆత్మహత్యకు ప్రేరేపణ అనే ఉద్దేశం ఆరోపిత వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించే చర్యగా పరిగణించలేము" అని స్పష్టం చేసింది.