న్యూఢిల్లీ: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆన్లైన్ లో ఫేక్న్యూస్ను అడ్డుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నిబంధనలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఇది భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుందంటూ గురువారం దానిపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గతంలోనే దీన్ని సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండి యా, స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటును అడ్డుకోవాలని కోరారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన బాంబే హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిం ది.
దీంతో పిటిషన్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్.. కేంద్రం ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఏర్పాటు చేస్తే తీవ్ర నష్టం జరగదని బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఇందులో రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉన్నాయని, వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై దాని ప్రభావాన్ని హైకోర్టు విశ్లేషించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.