
- స్ట్రాటజిస్టులను ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్
- సొంత సర్వేలు మొదలుపెట్టిన బీజేపీ
- సోషల్ మీడియాలో హోరెత్తుతున్న పోల్ పోస్టులు
- ఓటరు నాడి తెలుసుకునే పనిలో నాయకులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతో ప్రధాన పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్ తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకే) తో ఒప్పందం చేసుకోవడం, అన్ని నియోజకవర్గాల్లో సర్వే జరుగుతున్నదనే ప్రచారంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ప్రతిపక్ష లీడర్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ‘‘ఇదే పీకే రిపోర్ట్.. విజయం మాదే’’ అంటూ ఎవరికివారే తమ అనుచరులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి లైకులు కొట్టించుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా మూడు ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు సర్వే తమకే అనుకూలంగా ఉందంటే తమకే అనుకూలంగా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గాలవారీగా ఏ పార్టీలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయో, టికెట్లు ఎవరికి దక్కనున్నాయో జోస్యం చెబుతున్నారు. వాట్సాప్ మొదలుకొని ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా..ఇలా ఏ సోషల్ మీడియా చూసినా ఇలాంటి పోస్టులే కనిపిస్తున్నాయి. పోస్టులతో పాటు రిపోర్టులు, వాటి కింద అనుచరుల ఒపీనియన్లు, వాదోపవాదాలు, తిట్ల పురాణాలు సరేసరి.
టీఆర్ఎస్ తరఫున ఐప్యాక్ నిర్వాహకుడు ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ పార్టీ గతంలో పీకేతో కలిసి పనిచేసిన సునీల్ను స్ట్రాటజిస్టుగా తెచ్చుకుంది. సునీల్ ఈ నెలలోనే పని మొదలు పెట్టే అవకాశాలున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే బీజేపీ.. ఇప్పటికే సొంత సర్వేలు షురూ చేసింది. వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల.. పీకే టీంతో పనిచేసిన తమిళనాడుకు చెందిన స్ట్రాటజిస్ట్ను రంగంలోకి దించారు. ఎన్నికల్లో పోటీపడే పార్టీలతో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టి ‘అధ్యక్షా..’ అనాలని కలలు కంటున్న ఎందరో ఆశావహులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు.
ప్రజల నుంచి ప్రజల్లోకి..
వచ్చే ఎన్నికల్లో ఎంచుకోవాల్సిన ప్రచారాస్త్రాలు, ఇవ్వాల్సిన నినాదాలపై ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు కరసత్తు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తున్నారు. ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేలా స్లోగన్స్ రూపొందించే బాధ్యతలను సర్వే సంస్థలకు అప్పగించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ సర్వేల సందర్భంగా పబ్లిక్ రియాక్షన్, కొన్ని అంశాలపై వాళ్లు వెలువరించే అభిప్రాయం సందర్భంగా చూపించే ఎమోషన్స్, ఇతర అంశాలను పార్టీల నాయకులు సేకరిస్తున్నారు. టీఆర్ఎస్ ఇప్పటికే పలు ఓట్లు రాల్చే పథకాలు అమలు చేస్తుండగా వాటిని తలదన్నేలా స్కీంలు తెచ్చే ఆలోచనలో కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆకాంక్షలను ప్రజలతోనే చెప్పించి వాటి ద్వారా పథకాల రూపకల్పన చేసే ఆలోచనలో ఉన్నాయి. నిరుద్యోగులు, యువత, మహిళలు, రైతులు, వారి ఆలోచన ఎలా ఉంది? అనే అంశంపై ఫోకస్ చేస్తున్నాయి.
సర్వే ఏజెన్సీల్లో రిక్రూట్మెంట్ జోరు
సర్వే ఏజెన్సీలు రిక్రూట్మెంట్ జోరు పెంచాయి. ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో నియోజకవర్గం కోసం ఐదు నుంచి పది మందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. చిన్న ఏజెన్సీలు ఇద్దరు, ముగ్గురిని నియమించుకుంటున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారితో పాటు పబ్లిక్ పల్స్ సేకరించే నైపుణ్యం ఉన్న వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. ఇలా ఒక్కో సర్వే ఏజెన్సీ నిర్వాహకులు రాష్ట్రవ్యాప్తంగా 300 నుంచి 400 మంది యూత్ను ఎంపిక చేసుకుని వారికి సంబంధం లేని నియోజకవర్గాలకు పంపిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 సర్వే ఏజెన్సీలు కార్యకలాపాలు షురూ చేశాయి.
లోకల్ ప్రయారిటీలేంటి?
అసెంబ్లీ ఎన్నికలు స్టేట్ సెంట్రిక్గా జరిగేవే అయినా.. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటనే దానిపై సర్వే ఏజెన్సీలు ఫోకస్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో పెండింగ్ అంశాలు.. వాటిని పరిష్కరించడానికి ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చేశారు?ఎవరైనా ఆయా సమస్యలు పరిష్కరించే ఆస్కారం ఉందా? అనే అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఏయే పార్టీల్లో ఏ లీడర్ యాక్టివ్గా రియాక్ట్ అవుతారు? వాళ్ల బలాలు, బలహీనతలు ఏమిటి? ఆయా లీడర్లు ఏ పార్టీలో ఉంటే ఎమ్మెల్యే అయ్యే చాన్స్ ఉంది.. అనే కోణంలోనూ సమాచారం సేకరిస్తున్నారు. ప్రజలు చెప్పే సమాచారాన్ని ఫిల్టర్ చేయకుండానే ఏజెన్సీలు తమను ఎంగేజ్ చేసుకున్న పార్టీలు, నాయకులకు దానిని చేరవేస్తున్నాయి. ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ డైరెక్షన్లో సాగాలి.. ఎలాంటి అంశాలు ఎత్తుకోవాలి.. అనే దానిపై సలహాలు సూచనలు ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. 2,3 నెలల్లో సర్వేల బరిలోకి దిగేందుకు యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
సీఎం ఎవరైతే బెటర్..?
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. సీఎం ఎవరైతే బాగుంటుంది.. రాష్ట్రంలో, కేంద్రంలో మీకు నచ్చిన పథకాలేంటి.. అనే ప్రశ్నలపైనే సర్వే టీంలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. ప్రజలకు బాగా కనెక్ట్ అయిన పథకాల గురించి ఆరా తీస్తున్నాయి. ప్రభుత్వం చెప్పి చేయలేకపోయిన హామీలు, స్కీమ్లపై ప్రజల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తున్నాయి. అట్లనే.. ‘మీ నియోజకవర్గంలో వీళ్లలో ఎవరికి ఓటేస్తారు?’ అంటూ వివిధ పార్టీలకు చెందిన ఏడెనిమిది మంది పేర్లను సూచిస్తున్నాయి. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లను ప్రస్తావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలా పని చేస్తున్నారు.. ఇప్పటి వరకు ఏం చేశారు.. ఏం చేయలేకపోయారు.. అనే ప్రశ్నలు వేస్తూ వివరాలు రాబడుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనితీరుపై ఓవరాల్ వ్యూ ఎలా ఉందో అడిగి తెలుసుకుంటున్నాయి.
టీఆర్ఎస్కు పీకేతో పాటు 3 ఏజెన్సీలు
క్యాండిడేట్ల ఎంపికతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ పనితీరుపై పబ్లిక్ ఓపీనియన్ తెలుసుకునేందుకు పీకే టీంను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. టీఆర్ఎస్ తరపున పీకేతో పాటు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మరో మూడు ఏజెన్సీలు ఫీల్డ్లో పనిచేస్తున్నాయి. అదేవిధంగా ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సర్వేల బరువు మోస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకుల తరఫున సర్వే ఏజెంట్లు ప్రజల నాడిని పట్టేందుకు రకరకాల క్వశ్చనీర్లతో జనంలోకి వెళ్తున్నారు. లోకల్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆన్ లైన్ పోల్ లింక్ లు షేర్ చేస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
స్మార్ట్ సర్వేలు
గతంలో మాదిరి చేతిలో పేపర్, పెన్ను పెట్టుకోకుండా స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకంగా రూపొందించిన క్వశ్చనీర్ ద్వారా సర్వే ఏజెంట్లు ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. యాప్స్ క్రియేట్ చేసి లింక్ను వాట్సాప్ గ్రూపుల్లోకి వదులుతున్నారు. ఆయా గ్రూపుల్లో ఉన్న వ్యక్తులు ఫీడ్ బ్యాక్ ఇవ్వగానే రిజల్ట్ వస్తున్నది. కొన్ని సర్వే ఏజెన్సీలు సోషల్మీడియా వేదికగా వివరాలు సేకరిస్తుండగా, మరికొన్ని ఏజెన్సీలు పబ్లిక్లోకి వెళ్లి వారి పల్స్ తెలుసుకునే పనిలో పడ్డాయి. అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు రావొచ్చని భావిస్తున్నారు? కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందా? అనే కోణంలోనూ సమాచారం సేకరిస్తున్నారు.