హుజూర్ నగర్,వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. గురువారం హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో డాక్టర్లు లేకపోవడం, సమయం కాకముందే వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, టి-హబ్ లోపాలను సరిదిద్దాలని, నూతన ఓపీ బ్లాక్ నిర్మాణాన్ని స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.

