హీరోగా అయినా, గెస్ట్ రోల్ చేసినా, సపోర్టింగ్ క్యారెక్టర్ చేసినా.. అన్నీ తనకు నచ్చిన పాత్రలే చేస్తున్నా అన్నాడు సుశాంత్. అల వైకుంఠపురములో, రావణాసుర చిత్రాల్లో డిఫరెంట్ పాత్రలు పోషించిన సుశాంత్.. తాజాగా చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుశాంత్ చెప్పిన విశేషాలు.
‘‘చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్గా అనిపిస్తుంది. చిన్నప్పటినుంచి ఆయన సినిమాలు చూస్తూ అభిమానులుగా పెరిగాం. ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. అలాంటిది మెగాస్టార్తో స్క్రీన్ పంచుకోవడం అదృష్టం. మెహర్ రమేష్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని మాట తీసుకున్నా. అలాగే ‘జాం జాం జజ్జనక’ సాంగ్లో అవకాశం దక్కింది. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. కలర్ ఫుల్గా ఉంటూ.. సినిమాకి స్పెషల్ హైలైట్గా నిలుస్తుంది. ఇది చిరంజీవి గారు, కీర్తి సురేష్.. బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండే మూవీ. నాది క్యామియో రోల్ అయినా ఛార్మింగ్గా ఉంటుంది.
చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నాతో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. నా మొదటి సినిమాలో హీరోయిన్గా చేసిన తమన్నా ఇందులో మాత్రం నాకు సిస్టర్గా కనిపిస్తుంది. కీర్తి సురేష్ నాకు పెయిర్గా నటించింది. ‘వేదాళం’ రీమేక్ అయినా ఒరిజినల్ వెర్షన్ చూడలేదు. ఒరిజినల్ కంటే ఇందులో నా పాత్రని చాలా ఫ్రెష్గా డిజైన్ చేశారు. చిరంజీవి గారి పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయి. మెగాఫ్యాన్స్కి కావాల్సినదాని కంటే ఎక్కువ ఉంటుంది. చిరంజీవి గారు సెట్లో నాతో చాలా విషయాలు షేర్ చేసుకునేవారు. తాతగారి గురించి, సినిమా కబుర్లు.. ఇలా చాలా విషయాలు చెప్పారు. ఇది నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా అవుతుంది’’.