హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ ఓపెన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. స్కూల్ తెరిపించాలని కోరుతూ ఇటు స్టూడెంట్ యూనియన్ నేతలు, అటు పేరెంట్స్ నుంచి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం పేరెంట్స్, స్కూల్ మేనేజ్మెంట్ ప్రతినిధులు ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనను కలిసి చర్చించారు. చిన్నారిపై లైంగిక దాడి నేపథ్యంలో డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడంతో ఏర్పడ్డ సమస్యలను డైరెక్టర్కు వివరించారు. ఇప్పటికిప్పుడు వేరే స్కూళ్లకు పిల్లలను పంపడం ఇబ్బందేనని పేర్కొన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన స్కూల్ మేనేజ్మెంట్.. లోపాలను సరిదిద్దుకుంటామని, రీ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మేనేజ్మెంట్ నుంచి మరోసారి వివరణ కోరారు. ఎడ్యుకేషన్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని డీవీఏ స్కూల్ మేనేజర్ శేషాద్రి, పేరెంట్స్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు.
డైరెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆందోళన
ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీకుమార్తో పాటు ఆమెను సైతం శిక్షించాలంటూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. వెంటనే స్కూల్ను తెరిచి స్టూడెంట్లకు న్యాయం చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ సిటీ సెక్రటరీ అశోక్ రెడ్డి, డీవైఎఫ్ఐ సెక్రటరీ జావిద్ మాట్లాడుతూ.. ఇప్పటికే డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్ నుంచి వేల రూపాయల ఫీజులను వసూలు చేసిందన్నారు. ఇప్పుడు వేరే స్కూల్స్లో చేర్పిస్తే పేరెంట్స్పై భారం పడుతుందన్నారు. స్కూల్ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపించాలని కోరారు.