‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్గా గుర్తుంపును అందుకున్నాడు కన్నడ హీరో యష్. ఈ ప్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాల తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న యష్.. గతేడాది డిసెంబర్లో తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ‘టాక్సిక్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. కె. వెంకట్ నారాయణ, యష్ నిర్మిస్తున్నారు.
ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్ అనేది ట్యాగ్లైన్. అయితే సినిమా అనౌన్స్ మూడు నెలలు అవుతున్నా ఇంతవరకూ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి, శ్రుతిహాసన్, కియారా అద్వాని, కరీనా కపూర్ అంటూ వారానికో పేరు తెరపైకొస్తోంది. ఈ ప్రచారం మరింత జోరందుకోవడంతో చిత్ర నిర్మాణ సంస్థ దీనిపై స్పందించింది.
‘మా సినిమా విషయంలో మీ ఆసక్తి చూస్తుంటే ఆనందంగా ఉంది. నటీనటుల విషయంలో నిరాధారమైన ఊహాగానాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపిక దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆ విషయంలో మేము చాలా థ్రిల్ ఫీలవుతున్నాం. ఈ కథకు జీవం పోయడానికి సిద్ధం అవుతున్నాం. అధికారికంగా ప్రకటించేవరకు వేచి ఉండాలని కోరుతున్నాం’ అన్నారు. మరి ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్న నలుగురిలో ఒకరు.. యష్కు జంటగా నటించనున్నారా లేక మరో హీరోయిన్ ఆ అవకాశాన్ని అందుకుందో చూడాలి!