మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు

మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు

జనగామ ఉమ్మడి కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపిస్తూ.. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక రద్దు, పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడిగా ఉండి హనుమకొండలో పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలు చేయడంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ నుండి పోటీ చేస్తున్నానని తనకు తానే జంగా రాఘవరెడ్డి ప్రకటించుకోవడంతో వివాదం తెరపైకి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి, పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.

జిల్లా అధ్యక్షుడిగా జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసి అధిష్టానానికి పంపించామని డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. అధిష్టానం ఆమోదించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కొందరు అధిష్టానంలోని నేతలు జంగా రాఘవరెడ్డికి సహరిస్తున్నారని, ఆ అంశంపైనా ఫిర్యాదు చేశానని రాజేందర్ రెడ్డి తెలిపారు. రాఘవరెడ్డి జనగాం జిల్లా అధ్యక్షుడు కాదని, అధిష్టానం సమస్యను పరిష్కరించకపోతే వరంగల్ పశ్చిమలో పార్టీ తీవ్రంగా నష్ట పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అనుకూలంగా  జంగా రాఘవరెడ్డి పని చేస్తున్నాడన్న ఆయన.. నాలుగేళ్లుగా 20 సార్లు జంగా రాఘవరెడ్డిపై డీసీసీ అధ్యక్షుడిగా ఫిర్యాదు చేశానన్నారు. అధిష్టానం అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నానని.. ఇప్పటికైనా  అధిష్టానం చర్యలు తీసుకోకపోతే  తగిన విధంగా స్పందిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.