చీరాలలో మహిళా పోలీసు అనుమానాస్పద మృతి

 చీరాలలో మహిళా పోలీసు అనుమానాస్పద మృతి

ప్రకాశం జిల్లా: ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలోని 16వ వార్డు సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్న ఎం.భార్గవి (35) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమెకు భర్త రాంబాబుతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాల్మన్ సెంటర్లో వీరు నివాసం ఉంటున్నారు.  భర్త రాంబాబే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లి, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పినట్లువినడం లేదని చిత్రహింసలు పెట్టి చంపేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి ఇంట్లో ఏం జరిగిందో కాని గురువారం ఉదయం తెల్లారేసరికి భార్గవి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. విషయం తెలిసిన వెంటనే చీరాల ఒకటవ పట్టణ సీఐ రాజమోహన్‌ మృతదేహాన్ని పరిశీలించారు. తల్లి మృతితో పిల్లలు కంటతడిపెట్టి విలపించడం స్థానికంగా విషాదం రేపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. భార్గవి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల అనుమానం మేరకు భర్త రాంబాబును విచారణ చేస్తున్నారు. ఇద్దరి ఫోన్ల కాల్ డేటాను పరిశీలిస్తున్నామని.. వాట్సప్ ఛాటింగ్ లను విశ్లేషించడంతోపాటు అన్ని కోణాల్లో విచారణ చేస్తామని సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు.