
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పలువురు రాష్ట్ర మంత్రులు, బల్దియా మేయర్, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత.. రాజ్ భవన్ కు వచ్చారు సీఎం కేసీఆర్. కొన్నాళ్లుగా రాజ్ భవన్ , క్యాంప్ ఆఫీస్ మధ్య గ్యాప్ నడుస్తోంది. దీంతో కొంత కాలంగా రాజ్ భవన్ కు దూరంగా ఉంటున్నారు సీఎం. చివరి సారిగా గతేడాది అక్టోబరు 11 న రాజ్ భవన్ కు వెళ్లారు సీఎం కేసీఆర్. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు కేసీఆర్.
నాలుగేళ్ల కాలంలో సీజేగా బాధ్యతలు చేపట్టిన ఐదో వ్యక్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్. 2019, జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లి, నాలుగో సీజీగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పనిచేశారు. జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ కావడంతో.. తెలంగాణ హైకోర్ట్ లోనే పనిచేస్తున్న జస్టిస్ భూయాన్ కు పదోన్నతి కల్పించారు.
1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 21న అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత.. 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా.. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కూడా భూయాన్ కొనసాగుతున్నారు.