జెనీవా: కారుణ్య మరణానికి ఎదురుచూస్తున్నవారి కోసం స్విట్జర్లాండ్ కంపెనీ ఓ కొత్త మెషీన్ తయారు చేసింది. కేవలం ఒక్క నిమిషంలోనే ఎలాంటి నొప్పి లేకుండా, ప్రశాంతంగా చనిపోయేందుకు ఈ మెషీన్ ఉపయోగపడుతుందని చెబుతోంది. ప్రభుత్వం కూడా దీనిని గుర్తించి, చట్టబద్ధం చేసింది. కారుణ్య మరణాలు కూడా స్విట్జర్లాండ్లో చట్టబద్ధమే! ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. కిందటేడాది ఇలాంటి సంస్థల ద్వారా 1300 మంది కారుణ్య మరణం పొందారు. ఇలాంటి ఓ ఆర్గనైజేషనే ‘ఎగ్జిట్ ఇంటర్నేషనల్’. ఈ సంస్థకు డైరెక్టర్గా ఉన్న డాక్టర్ ఫిలిప్ నిట్చికే ఈ సూసైడ్ మెషీన్ను తయారుచేసిండు. స్థానికులు ఆయనను డాక్టర్ డెత్ అని కూడా పిలుస్తారు. శవపేటికను పోలిన ఈ మెషీన్ను కావాల్సిన చోటికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది.
ఇదెలా పనిచేస్తదంటే..
లోపల పడుకోబెట్టిన మనిషి శరీరంలో ఆక్సీజన్ లెవెల్స్ను తగ్గించేస్తుంది. రక్తంలో కార్బన్డయాక్సైడ్ను కూడా తగ్గించడం వల్ల నొప్పి లేకుండా చనిపోతారట. దీనిని బయట నుంచే కాదు.. లోపల నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చని నిట్చికే చెప్పారు. శరీరమంతా చచ్చుబడి, కేవలం కండ్లు మాత్రమే కదపగలిగే స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. కనురెప్పలు ఆర్పుతూ, తెరవడం ద్వారా మెషీన్ను ఆన్ చేసేలా డిజైన్ చేశామని వివరించారు. అయితే, గ్యాస్ ఛాంబర్ను గ్లామరైజ్ చేసి తయారు చేసిందే ఈ మెషీన్ అని విమర్శకులు మండిపడుతున్నారు. ఆత్మహత్యకు ఈ మెషీన్ గ్లామర్ జోడించిందని ఇంకొందరు
విమర్శిస్తున్నారు.
