న్యూఢిల్లీ: కుర్రాళ్లతో నిండిన టీమిండియా టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకొని నేటికి పదమూడేళ్లు పూర్తయ్యాయి. జులపాల ధోని నాయకత్వంలో కుర్రాళ్లు చెలరేగి కప్పు కొట్టిన క్షణాలు క్రికెట్ ఫ్యాన్స్ ముందు ఇంకా కదలాడుతూనే ఉన్నాయి. ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో జోగిందర్ శర్మ బౌలింగ్లో పాకిస్తాన్ బ్యాట్స్మన్ మిస్బా ఉల్ హక్ కొట్టిన బాల్ను శ్రీశాంత్ ఒడిసి పట్టుకోగానే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. ఏళ్ల నిరీక్షణకు తెర దించిన మూమెంట్ అది. అప్పుడెప్పుడో కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్ కప్ సాధించిన ఇండియాకు పెద్ద కప్పు రావడం రెండోసారి కావడం విశేషం.
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి సీనియర్ల అండ లేకుండా టీమ్ను యువ ధోని నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. టోర్నీ ఆరంభంలో పాక్ను బౌలౌట్ చేయడంలో స్పిన్నర్లను బౌలింగ్ చేయించడం ద్వారా ధోని కెప్టెన్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ టోర్నీలోనే యువరాజ్ సింగ్ ఆరు సిక్సులతో అలరించాడు. సెమీస్లో ఆసీస్పై 30 బంతుల్లో 70 రన్స్ కొట్టిన యువీ ఇన్నింగ్స్ అందరికీ గుర్తుండే ఉంటుంది. టీమిండియా 2011 వరల్డ్ కప్, టెస్టుల్లో నంబర్ వన్ ఘనతను సాధించడానికి, మంచి ఫ్యూచర్కు ఇక్కడే బీజం పడింది. ముఖ్యంగా ధోని కెప్టెన్గా తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇలా 2007 టీ20 వరల్డ్ కప్తో టీమిండియాకు, ఫ్యాన్స్కు మర్చిపోలేని ఎన్నో మధురానుభూతులు ఉన్నాయనే చెప్పాలి.