అనంతపురం జిల్లా హిందూపురంలో నివాసం ఉంటున్న ఒక తహసిల్దార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు జిల్లా లెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సదరు తహసీల్దార్ విధులకు హాజరుకాలేకపోయాడు. దీంతో నమూనాలను సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్లు వెల్లడైంది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై అతన్ని అనంతపురంలోని కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ డ్రైవర్, అటెండర్, కార్యాలయ సిబ్బంది చిరునామాలను సేకరించిన అధికారులు .. వారిని క్వారంటైన్కు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
కరోనా నివారణకు తీసుకున్న చర్యలపై ఇటీవల మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి నిర్వహించిన సమీక్షకు తహసీల్దార్ హాజరైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఎమ్మెల్యే సైతం క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లోని ఓ డాక్టర్ కు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. కళ్యాణదుర్గం పాజిటివ్ కేసుకు సంబంధించిన కాంటాక్ట్ వల్ల ఆ డాక్టర్ కు పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.