- ప్రమాణ స్వీకారానికి ముందే మెజారిటీ నిరూపించుకోవాలని మెలిక
- సర్కారు ఏర్పాటుకు కావాల్సింది 118 మంది ఎమ్మెల్యేలు
- కాంగ్రెస్ సపోర్ట్తో టీవీకేకు ఉన్నది 112 మంది ఎమ్మెల్యేలే
- 4 సీట్లు గెలిచిన వామపక్షాలు.. డీఎంకేతోనే ఉంటామని వెల్లడి
- సందిగ్ధంలో సర్కారు ఏర్పాటు
- తమిళనాడులో ఊహించని పరిణామాలు
న్యూఢిల్లీ: తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత సంఖ్యాబలం లేదనే కారణంతో ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ సపోర్ట్తో విజయ్ పార్టీకి 112 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతున్నది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్కి గవర్నర్ ఆహ్వానం పంపారు. ఆయనకు పంపిన ఆహ్వాన ప్రకటనను లోక్భవన్ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలుకూడా తమతో చేతులు కలుపనున్నాయని గవర్నర్కు వివరించి చెప్పారు. సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటానని తెలిపారు. అయితే, టీవీకే చీఫ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిపి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం తప్పనిసరి. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉంటుంది. కాంగ్రెస్ సభ్యులను కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై ఉత్కంఠ నెలకొన్నది.
తమిళనాడులో ఉదయం నుంచే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఎవరూ ఊహించని విధంగా.. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్.. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ప్రకటించింది. ‘‘మతతత్వ శక్తులను దూరంగా ఉంచడమే మా లక్ష్యం’’ అని చెబుతూ, 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చెన్నైలోని కాంగ్రెస్ కార్యాలయంలో కార్యకర్తలు పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. మరోవైపు మెజారిటీకి కేవలం కొద్ది దూరంలోనే ఉండటంతో.. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీవీకే రంగంలోకి దిగింది. మధ్యాహ్నం కల్లా 50 మందికి పైగా ఎమ్మెల్యేలను మామల్లాపురంలోని ఒక ప్రైవేట్ లగ్జరీ రిసార్ట్కు తరలించారు. అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం విజయ్ మధ్యాహ్నం లోక్భవన్కు చేరుకున్నారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి, తన వద్ద తగినంత మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. దాదాపు అర గంట పాటు ఈ భేటీ కొనసాగింది. 118 మంది సభ్యులు సమకూరిన అనంతరమే రావాలని విజయ్కి గవర్నర్ సూచించినట్టు సమాచారం.
6 సీట్ల దూరంలో అధికారం..
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం. కాగా, విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజారిటీకి కేవలం 10 సీట్ల దూరంలో ఉన్న విజయ్కి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అయితే, కాంగ్రెస్తో పాటు ఇంకా ఏయే పార్టీలు, స్వతంత్రులు విజయ్కు మద్దతు ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2 స్థానాల్లో విజయం సాధించిన విదుతలై చిరుతైగళ్ కట్చి(వీసీకే) మద్దతును విజయ్ కోరారు. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు తొల్ తిరుమావళవన్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు, వామపక్షాలు (సీపీఐ, సీపీఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాయి. తాజా సమాచారం ప్రకారం, విజయ్ బృందం అన్నాడీఎంకే లోని ఒక వర్గంతో చర్చలు జరుపుతున్నది. ఆ పార్టీకి చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అన్నా డీంకే ఎమ్మెల్యేలతో కలిసి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా ఎవరి మద్దతు కోరుతారు? అనే ఉత్కంఠ నెలకొన్నది.
