కరోనా లాక్ డౌన్ తో రెవెన్యూ భారీగా పడిపోవడంతో ప్రభుత్వాలు ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. వ్యాట్ పెంచుతూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్ పై లీటరుకు రూ.3.25, డీజిల్ పై రూ.2.50 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.29గా ఉండగా తాజా పెంపుతో రూ.75.54కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ రేటు రూ.65.71 నుంచి రూ.68.21కి పెరిగింది.
గత నెలలో నాగాలాండ్ కూడా ఇదే రకమైన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ తో ఎదురైన ఫైనాన్షియల్ క్రైసిస్ ను ఎదుర్కొనేందుకు డీజిల్, పెట్రోల్ రేట్లను పెంచింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. డీజిల్ లీటరుకు పై రూ.5, పెట్రోల్ పై లీటరుకు రూ.6 చొప్పున అదనంగా సెస్ విధించింది నాగాలాండ్ సర్కారు.