
- ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం 10 సిఫార్సులు సూచించిన
- ప్రొటోకాల్, విమర్శలతో నన్ను కట్టడి చేయలేరు
- నాకు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదు
- రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం లేదు
- సవాళ్లు, అడ్డంకులు దాటి 4 ఏండ్ల టర్మ్ పూర్తి చేశానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రగతి భవన్కు, రాజ్భవన్కు మధ్య గ్యాప్ లేదని గవర్నర్ తమిళిసై అన్నారు. బిల్లులను ఆపడంలో రాజకీయ కోణం లేదని, అందుకు కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పారు. తనకు ఎలాంటి పొలిటికల్ ఎజెండా లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం లేదని తెలిపారు. సీఎం కేసీఆర్ సీనియర్, పవర్ ఫుల్ నేత అని, 4 ఏండ్ల నుంచి ఆయన పాలన చూస్తున్నట్లు చెప్పారు. తాను గవర్నర్గా వచ్చి 4 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాజ్భవన్లో కాఫీ టేబుల్ బుక్ను తమిళిసై ఆవిష్కరించారు.
తర్వాత తమిళిసై మాట్లాడుతూ.. తెలంగాణకు తొలి మహిళా గవర్నర్గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉందని, కాని గవర్నర్ ఆఫీస్కు కొంత లిమిటేషన్ ఉందని అన్నారు. తన ఫోకస్ అంతా ప్రజల అభివృద్ధి కోసమేనని, మరింత మెరుగ్గా సేవ చేయడమే తన బాధ్యత అని చెప్పారు. తనది కన్నింగ్ మెంటాలిటీ కాదని, పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్గా ఉండాలని అనుకున్నానని అన్నారు. ‘‘6 గ్రామాలను దత్తత తీసుకున్నా. ట్రైబల్ ప్రాంతాల్లో పర్యటించా. న్యూట్రీషన్ ఫుడ్ అందజేశాం. నా విచక్షణాధికారం కింద కమ్యూనిటీ హాల్స్, స్కూళ్లలో ఫర్నీచర్ అందించా” అని తమిళిసై వివరించారు.
ప్రజా శ్రేయస్సు కోసమే
బిల్లులు ఆపటంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని, ప్రజా శ్రేయస్సు మాత్రమే ఉందని తమిళిసై చెప్పారు. రాజ్యాంగ ప్రొసీజర్ ప్రకారమే నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం 10 సిఫార్సులు సూచించానని చెప్పారు. ‘‘ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. కార్మికుల లబ్ధి కోసమే డ్రాఫ్ట్కు అనుమతి ఇచ్చే టైమ్లో సందేహాలను లేవనెత్తాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ను ముట్టడించేందుకు వస్తే.. వారిని లోపలికి ఆహ్వానించి పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాను. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాను. లా సెక్రటరీ ఒపీనియన్ కోరాను. ఆర్టీసీ బిల్లు గురువారమే రాజ్భవన్కు వచ్చింది. బిల్లును పరిశీలిస్తా” అని తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పేర్ల సిఫార్సుకు కేటగిరీ ఉంటుందని, ఇటీవల ప్రభుత్వం పంపిన పేర్లతో ఏ కేటగిరీ అన్నది స్పష్టత ఇవ్వలేదని, అందుకే ఆమోదించలేదని వివరించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదని స్పష్టం చేశారు. ఏ కేటగిరీలో పేర్లు పంపించారో స్పష్టత ఇస్తే.. తాను ఆమోదించటానికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.
సనాతన వ్యాఖ్యలు సరికాదు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ మైలేజ్ కోసమేనని గవర్నర్ తమిళిసై విమర్శించారు. ‘‘తమిళనాడులో ఒక సెక్షన్ ప్రజలను అవమానించే ప్రక్రియ జరుగుతున్నది. ఎవరి సంప్రదాయాలు వాళ్లకు ఉంటాయి. ఒక మతాన్ని, కులాన్ని చులకన చేసి చూడొద్దు. ప్రతి పండుగకు స్టాలిన్ ఎందుకు విషెస్ చెబుతున్నారు?” అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలకు తాను పూర్తి మద్దతు తెలుపుతున్నానని, ఏటా ఏదో ఒక రాష్ర్టంలో ఎన్నికలు జరగటం వల్ల వేల కోట్లు ఖర్చు అవుతున్నాయని, అధికారులు ఎన్నికలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తున్నదని చెప్పారు. ఒక తమిళియన్గా చిన్నప్పటి నుంచీ తన నినాదం భారతేనని.. ఇండియా పేరును ‘భారత్’గా మార్చటంలో తప్పేం లేదని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బాగుండాలి
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య రిలేషన్షిప్ బాగుండాలని గవర్నర్ అన్నారు. లేకపోతే పీఎం రాష్ర్టానికి వచ్చిన ప్రతిసారి సీఎం వెళ్లకుండా ఉంటారన్నారు. రూరల్ డెవలప్ మెంట్ కోసం ఎన్నో స్కీమ్స్ ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన అభిమతమన్నారు. మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగిందని, తెలంగాణకు కూడా మెడికల్ కాలేజీలను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. బతికున్నన్ని రోజులు పనిచేస్తూనే ఉంటానని, 24 గంటలు ఏదో ఒక పనిచేస్తూనే ఉంటానన్నారు. తిరిగి రాజకీయాల్లోకి వెళ్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేనని అన్నారు.
నా డ్యూటీ నేను చేస్తున్నా
రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో తనపై చేస్తున్న రాజకీయ విమర్శలను పట్టించుకోనని తమిళిసై స్పష్టం చేశారు. ఇలాంటి వాటితో తనను కట్టడి చేయలేరని తేల్చిచెప్పారు. తన డ్యూటీ తాను చేస్తున్నానని అన్నారు. ప్రజల విజయమే తన విజయమన్నారు. ‘‘నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. నేను కూర్చున్న సీటు విలువ నాకు తెలుసు. కోర్టు కేసులు, సవాళ్లు, విమర్శలు, అడ్డంకులు దాటుకొని 4 ఏండ్ల టర్మ్ పూర్తి చేశా. ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరువలేనిది. రాజ్భవన్ను ప్రజా భవన్గా మార్చాను. మహిళల సమస్యలు తెలుసుకునేందుకు మహిళా దర్బార్ నిర్వహించా. పేద విద్యార్థులకు ల్యాప్ ట్యాప్లు అందజేశా. తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు” అని అన్నారు. ‘‘జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు ప్రొటోకాల్ పాటించలేదు. నన్ను రిసీవ్ చేసుకోలేదు. అదే పుదుచ్చేరిలో నలభై మంది ఐఏఎస్ ఆఫీసర్లతో ప్రతి నెలా గ్రీవియన్స్ డే నిర్వహిస్తున్నా” అని చెప్పారు.