
- ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- సీఎం రేవంత్కు తమ్మినేని వీరభద్రం లేఖ
హైదరాబాద్, వెలుగు: ఆశా వర్కర్లకు పరీక్ష నిర్వహించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. పరీక్ష పెట్టడం వల్ల వారి ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. 28 వేల మంది ఆశావర్కర్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చిన సర్క్యులర్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామంటూ అధికారులు చెప్తున్నారని తెలిపారు. దీనిపై పలు అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొంటూ ఆదివారం ఆయన రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘‘ఆశా వర్కర్ల నైపుణ్యం పెంచేందుకే పరీక్ష పెడ్తున్నం.. తొలగించేందుకు కాదని అధికారులు చెప్తున్నారు. అదే నిజమైతే వారికి ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు పరీక్ష పెట్టి సర్టిఫికెట్ ఇవ్వడమంటే కొంతమందిని తొలగించే ప్రమాదం ఉంది. కేంద్రం నిర్ణయం అనేక అనుమానాలకు తావిస్తున్నది. కరోనా కాలంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వీరికి ‘‘హెల్త్ గ్లోబల్ లీడర్స్’’ అని అవార్డు కూడా ఇచ్చింది.
గిరిజన ప్రాంతాల్లో 33 ఏండ్లుగా, మైదాన ప్రాంతాల్లో 19 ఏండ్లుగా నిత్యం మహిళలు, బాలబాలికలకు వాళ్లు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. గర్భిణులకు, బాలింతలకు కూడా ప్రత్యేక సేవలందిస్తున్నారు’’అని లేఖలో పేర్కొన్నారు. ఇంత కాలం నుంచి పనిచేస్తున్న వీరికి.. ఇప్పుడు కొత్తగా పరీక్ష నిర్వహించి జ్ఞాపకశక్తిని పరిక్షించాలనుకోవడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. ఆశాల ఆందోళనలను గమనించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరీక్ష నిర్వహించబోమని ప్రకటించిందని చెప్పారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడం సరికాదని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ పంపించినప్పటికీ దేశంలో ఎక్కడా ఈ పరీక్ష నిర్వహించలేదు. బీజేపీ సర్కార్ నిర్ణయాన్ని వెంటనే తెలంగాణలో అమలు జరపాలని ఉన్నతాధికారులు ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారో అర్థం కావడం లేదు. తక్షణమే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఆశావర్కర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి. వారి వేతనాలు, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక సమస్యలను పరిష్కరించాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.