హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర సర్కారును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో కమిషన్ సభ్యులను సస్పెండ్ చేయాలని, ఈ కేసుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని శనివారం ఓ ప్రకటనలో ఆయన కోరారు. 30 లక్షల మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లూ కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయితే, వారి ఆశలపై కేసీఆర్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. లీకేజీ ఘటనలో సీఎం కేసీఆర్ కుటుంబం పాత్రపైనా విచారణ జరిపించాలన్నారు. ‘‘కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రంలో ఓ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.
వాటన్నింటినీ బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. పేపర్ల లీకేజీ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కావాలనే సైలెంట్ అయ్యిండు” అని తరుణ్ వ్యాఖ్యానించారు. కాగా, పంజాబ్ మంత్రి హర్భజన్ సింగ్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్, కేంద్ర ఎన్నికల సంఘానికి తరుణ్ చుగ్ ఫిర్యాదు చేశారు. జలంధర్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా పోస్టర్లు అతికించారని, అది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకుని హర్భజన్ సింగ్ను పదవి నుంచి తప్పించాలని, ఎన్నికల సంఘం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.