వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భార్య

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భార్య

వరంగల్: వరంగల్లో ప్రసిద్ధి గాంచిన భద్రకాళి మాత దేవస్థానాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన పవన్ సతీమణికి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. 

ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి.. ప్రసాదం అందజేశారు.

కాకతీయుల కాలంలో 800 ఏండ్ల కింద నిర్మించిన భద్రకాళి అమ్మవారి ఆలయం వందల ఏండ్ల పాటు భక్తుల సందర్శనతో విరాజిల్లింది. కాకతీయుల రాజ్యం ప్రాభవం కోల్పోయిన తర్వాత దాదాపు 625 ఏండ్లు ఆదరణ కోల్పోయింది. 1948లో బీఎస్‍ గణేశ్‍ శాస్త్రీ దాతల సాయంతో ఆలయాన్ని పునరుద్ధరించారు. 

1986లో దక్షిణ భారత్ లోని ఆలయాల సంప్రదాయాల ప్రకారం ఆలయ శిఖరం, మహా మండపం, సాలహారాలను నిర్మించారు. మరోసారి ప్రస్తుత ప్రభుత్వం ఆలయ పునరుద్ధరణ పనులను చేపట్టింది.