న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్, దాని మూడు కీలక సేవాసంస్థలకు మెహ్లీ మిస్త్రీని తిరిగి ట్రస్టీగా నియమించాలన్న ప్రతిపాదనను ట్రస్ట్ సర్కులేట్ చేసింది. ఈ నిర్ణయం వల్ల ఆయన జీవితకాల ట్రస్టీ అయ్యే అవకాశం ఉంది. టాటా ట్రస్ట్స్ సీఈఓ పేరుతో గురువారం ఇతర ట్రస్టీలకు సర్క్యులర్ వచ్చింది. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, బాయి హీరాబాయి జంషెట్జీ టాటా నవ్సారి ఛారిటబుల్ ఇన్స్టిట్యూషన్లకు మిస్త్రీని తిరిగి నియమించాలని కోరింది.
సంస్థలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రతన్ టాటాకు సన్నిహితుడైన మిస్త్రీ 2022లో మొదటిసారిగా టాటా ట్రస్ట్స్లో చేరారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఈనెల 28న ముగుస్తుంది. ఈ వారం ప్రారంభంలో, టాటా ట్రస్ట్స్ వేణు శ్రీనివాసన్ను జీవితకాల ట్రస్టీగా ఏకగ్రీవంగా తిరిగి నియమించింది.
టాటా సన్స్ 156 ఏళ్ల టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ. ఇందులో 30 లిస్టెడ్ సంస్థలతో సహా దాదాపు 400 కంపెనీలు ఉన్నాయి. ట్రస్టుల్లో విభేదాలను తొలగించడానికి కేంద్రమంత్రులు అమిత్షా, నిర్మలా సీతారామన్ కూడా చర్చలు జరిపారు.
