- పొలిట్బ్యూరోలో చర్చించి పోటీ చేయరాదని నిర్ణయం
అమరావతి: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేయరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. టీడీపీ పొలిట్బ్యూరో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బద్వేలు ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపిక చేసిన రాజశేఖర్, విజయమ్మ ఇతర టీడీపీ నాయకులతో మాట్లాడాక నిర్ణయం ప్రకటించాలని టీడీపీ పొలిట్బ్యూరో భావించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరణించిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చాక అక్కడ ఏకగ్రీవం చేసే సంప్రదాయాన్ని నెలకొల్పింది టీడీపీయేనని పొలిట్బ్యూరో గుర్తు చేసింది. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఆ సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. బద్వేలులో మరణించిన కుటుంబానికే టికెట్ ఇవ్వడంతో పోటీ అంశంపై చర్చించిన నాయకులు పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ పొలిట్బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిర్ణయం ప్రకటించే ముందు బద్వేల్ నాయకులతో మాట్లాడాలని చంద్రబాబు సూచించారు.
మరో వైపు జనసేన పార్టీ కూడా బద్వేల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిన్ననే ప్రకటించింది. బీజేపీ, ఇతర పార్టీలు పోటీ చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణించడంతో ఇక్కడ ఉఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. అక్టోబర్ 30న ఉప ఎన్నిక, నవంబర్ 2న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.