
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలోని హన్మాన్మందిర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తండ్రి మంగళవారం దాడి చేశాడు. బయటకు వెళ్లిన స్టూడెంట్ను ఉపాధ్యాయుడు మందలించాడనే కోపంతో స్కూల్కు వచ్చి ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. హన్మాన్ మందిర్ ప్రైమరీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఈ నెల 21న ఓ టీచర్ పర్మిషన్తో మరో విద్యార్థినితో కలిసి బయటకు వెళ్లింది. చాలా సేపటి తరువాత తిరిగి రావడంతో 5వ తరగతి చదువుతున్న బాలికతో పాటు మరో విద్యార్థినిని ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించారు.
ఈ విషయాన్ని బాలిక తన తండ్రి వడ్ల సాయికృష్ణకు చెప్పింది. మంగళవారం స్కూల్కు వచ్చిన సాయికృష్ణ ఏమి అడగకుండానే ఉపాధ్యాయుడు బాలకృష్ణను దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో అక్కడే ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. సాయికృష్ణ కొట్టాడని ఉపాధ్యాయుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తనను టీచర్ దూషించాడని విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఉపాధ్యాయుడిపై దాడి చేయటాన్ని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ సంగయ్య ఖండించారు.