కామారెడ్డిలోని హన్మాన్ మందిర్ ప్రైమరీ స్కూల్లో టీచర్పై దాడి

కామారెడ్డిలోని హన్మాన్ మందిర్ ప్రైమరీ స్కూల్లో టీచర్పై దాడి

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి పట్టణంలోని హన్మాన్​మందిర్​ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడిపై ఓ విద్యార్థి తండ్రి మంగళవారం దాడి చేశాడు. బయటకు వెళ్లిన స్టూడెంట్​ను ఉపాధ్యాయుడు మందలించాడనే కోపంతో స్కూల్​కు వచ్చి ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు, బాధితుడు తెలిపిన ప్రకారం.. హన్మాన్​ మందిర్​ ప్రైమరీ స్కూల్​లో 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఈ నెల 21న ఓ టీచర్​ పర్మిషన్​తో మరో విద్యార్థినితో కలిసి బయటకు వెళ్లింది. చాలా సేపటి తరువాత తిరిగి రావడంతో 5వ తరగతి చదువుతున్న బాలికతో పాటు మరో విద్యార్థినిని ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించారు.

ఈ విషయాన్ని బాలిక తన తండ్రి వడ్ల సాయికృష్ణకు చెప్పింది. మంగళవారం స్కూల్​కు వచ్చిన సాయికృష్ణ  ఏమి అడగకుండానే ఉపాధ్యాయుడు బాలకృష్ణను దుర్భాషలాడుతూ చేయిచేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో అక్కడే ఉన్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. సాయికృష్ణ కొట్టాడని ఉపాధ్యాయుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తనను టీచర్​ దూషించాడని విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఉపాధ్యాయుడిపై  దాడి చేయటాన్ని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా జనరల్  సెక్రెటరీ సంగయ్య ఖండించారు.