మలక్ పేట, వెలుగు: ఓ విద్యార్థిపై కాలేజీ ఫ్లోర్ఇన్చార్జి దారుణంగా దాడి చేశాడు. దిల్ సుఖ్ నగర్ గడ్డిఅన్నారం నారాయణ జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. బాధిత విద్యార్థి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. అల్మాస్ గుడా ప్రాంతానికి చెందిన దొంతిక సంతోష్ కుమార్ కొడుకు సాయి పునీత్ దిల్ సుఖ్ నగర్ గడ్డి అన్నారం నారాయణ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్ చదువుతున్నాడు.
ఈ నెల 15న ఇద్దరు స్టూడెంట్ల మధ్య వాగ్వాదం జరగ్గా, ఫ్లోర్ ఇన్చార్జ్ మాలి సతీష్ జోక్యం చేసుకొని సాయి పునీత్ను కొట్టాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో సాయి పునీత్ ఎడమ దవడ ఎముక విరిగిపోయింది. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బాధిత స్టూడెంట్ తల్లిదండ్రులు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ పిడమర్తి నరేశ్ తెలిపారు.
