స్కూళ్లు, కాలేజీలకు సెలవులొచ్చి నెలలు దాటింది. చదువు లేక పిల్లలు వెనకబడిపోతున్నారు. ఇంకొందరు ఖాళీగా ఉండలేక టీవీలకు, స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. అందుకే అలాంటివాళ్లను దారిలో పెట్టేందుకు ఈ టీచర్ ఆన్లైన్లో పాఠాలు చెప్తున్నా డు. పేద పిల్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ చానెల్ కూడా నడుపుతున్నాడు.
జగిత్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తానిమడుగుకు చెందిన మాలోత్ తిరుపతి నాయక్ జగిత్యాలలోని మైనార్టీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. కొన్ని నెలలుగా స్కూళ్లు తెరవకపోవడంతో ఖాళీగానే ఉంటున్నాడు. ఈ ఖాళీ టైంలో కూడా పేద పిల్లలకు ఉపయోగపడేలా ఏదైనా చేయాలనుకున్నాడు. గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లల కోసం ఆన్లైన్లో క్లాసులు చెప్తే బాగుంటుందని ఆలోచించాడు. దాంతో ఒక యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేశాడు. పిల్లలకు కావాల్సిన సబ్జెక్టులు యూట్యూబ్లో చాలానే ఉన్నాయి. కానీ.. సోషల్ సబ్జెక్ట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. అందుకే సోషల్ మీడియాలో సోషల్ సబ్జెక్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు సోషల్ సబ్జెక్ట్ క్లాసులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాడు.
పల్లెల్లో పిల్లల కోసం..
పల్లెల్లో పిల్లలకు అందరి ఇళ్లల్లో స్మార్ట్ ఫోన్లు ఉండవు. ఇంకొందరికి మొబైల్ ఉన్నా..ఇంటర్నెట్ సరిగా రాదు. అలాంటి పిల్లలు యూట్యూబ్లో చూసి నేర్చుకోలేరు. అందుకే వాళ్లకు సబ్ జెక్ట్ లను పెన్డ్రైవ్లో లోడ్ చేసి ఫ్రీగా ఇస్తున్నాడు. వాటిని ఇంట్లోని టీవీలకు కనెక్ చేసుకుని చూడొచ్చు. ఇప్పటివరకు 200 మందికి ఫ్రీగా పెన్డ్రైవ్లు ఇచ్చాడు. ‘ఇప్పటివరకు అన్ని తరగతుల సోషల్ సబ్జెక్ట్ ‘Thirupathi Maloth Social Classes’ చానెల్లో అప్లోడ్ చేశా. పిల్లలు ఖాళీగా ఉండకుండా ఆన్లైన్ క్లాసులు వినాలి. యూట్యూబ్లో చూడడం ఇబ్బందిగా ఉన్నవాళ్లు.. నామెయిల్ ఐడీ thirupathisocial@gmail.comకి మెయిల్ చేసినా.. వాళకు ఫ్రీగా అన్ని సబ్జెక్టుల నోట్స్ పంపిస్తాను. వాటిని డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు’ అంటున్నాడు తిరుపతి.