
సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ ధర్నా చౌక్ కు చేరుకున్న టీచర్లు… అసెంబ్లీ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే కొందరు టీచర్లు పోలీస్ వాహనాల నుంచి కిందికి దిగి ఆందోళన చేశారు. పీఆర్సీని ప్రకటించి, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీనే అడుగుతున్నామని చెప్పారు. పీఆర్సీ గడువును డిసెంబర్ కు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీచర్లు. వీ వాంట్ జస్టిస్, ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని నినాదాలు చేశారు. విద్యారంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉపాధ్యాయుల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. పీఆర్సీని తక్షణమే ప్రకటించి అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. వరంగల్ అర్బన్ జిల్లాలో 10 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని ఇంతేజార్ గంజ్ పోలీస్ ష్టేషన్ కు తరలించారు. కాకతీయ మెడిల్ కాలేజీకి చెందిన 8 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే జనగామ జిల్లాలో 30 మందికి పైగా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలకు వెళ్లే తమను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారని కొందరు టీచర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.