
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో తొలి టెస్ట్లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. రెండో మ్యాచ్పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జులై 2 నుంచి జరిగే ఈ మ్యాచ్ తుది జట్టు ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో ఘోరంగా ఫెయిలైన శార్దూల్ ఠాకూర్ ప్లేస్లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను టీమ్లోకి తీసుకోవాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.
అయితే తొలి టెస్ట్లో శార్దూల్ను ఆడించాలన్న కెప్టెన్ శుభ్మన్ గిల్ నిర్ణయాన్ని చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ సమర్థించినా.. రెండో టెస్ట్ జట్టు ఎంపికపై పెద్దగా స్పందించలేదు. డిసెంబర్ 2023 తర్వాత తొలి టెస్ట్ ఆడిన శార్దూల్ 16 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు మాత్రమే తీశాడు. బ్యాటింగ్లో 5 రన్స్ చేశాడు. దీంతో అతని ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
‘తొలి టెస్ట్లో నలుగురు పేసర్లతో ఆడటంలో అర్థం లేదు. శార్దూల్, ప్రసిధ్లో ఒకర్ని తప్పించి కుల్దీప్ను ఆడించాల్సింది. కనీసం రెండో టెస్ట్కైనా కుల్దీప్ను తీసుకురావాల్సిందే. బర్మింగ్హామ్ పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరిస్తుంది. ఇంగ్లండ్లో నలుగురు పేసర్లు ఆడించే అలవాటు ఉంటుంది. కానీ వేసవిలో ఎక్కువ భాగం పొడి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. అందుకే తుది జట్టులో జడేజాతో పాటు కుల్దీప్ కూడా ఉండాలి’ అని మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డాడు.
నితీశ్కూ చాన్స్ ఇవ్వాలి..
ఐదో రోజు ఆటలో ఇండియా పైచేయి సాధించకపోవడానికి చాలా కారణాలున్నాయని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కుల్దీప్ను తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. ‘రెండో టెస్ట్లో కుల్దీప్ను ఆడించాలి. అవసరమైతే నితీశ్ను కూడా తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో అతను బాగా ఆడాడు. నా వరకైతే తొలి టెస్ట్లోనే ఆడిస్తే బాగుండేది. రెండో టెస్ట్కైనా ఇండియా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంగ్లండ్లో ఆడేటప్పుడు కచ్చితంగా నాణ్యమైన బౌలర్లే ఉండాలి. అందులో ఇద్దరు స్పిన్నర్లు తప్పనిసరి’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు.
శార్దూల్తో తక్కువ ఓవర్లు వేయించాలన్న నిర్ణయం గిల్దేనని గౌతీ వెల్లడించాడు. ‘కొన్నిసార్లు కెప్టెన్ తన ఆలోచనతో ముందుకెళ్తాడు. తొలి ఇన్నింగ్స్లో జడేజా బౌలింగ్ బాగా వేశాడు. దానివల్ల మేం ముగ్గురు పేసర్లను రొటేట్ చేయగలిగాం. శార్దూల్లో నైపుణ్యం ఉంది. ఇండియా తరఫున ఆడుతున్నాడు. నాలుగో సీమర్ అయినంత మాత్రాన స్పిన్నర్ కంటే ముందే రావాల్సిన అవసరం లేదు. పిచ్ను బట్టి బౌలర్లను ఉపయోగించుకుంటాం’ అని గంభీర్ పేర్కొన్నాడు.
మరో మూడు సెంచరీలు ఉన్నాయి..
పంత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలపై గంభీర్ విభిన్నంగా స్పందించాడు. జట్టు ఫలితాన్ని సాధించలేనప్పుడు ఎన్ని చేసినా ఏం లాభం ఉండదన్నాడు. ‘పంత్ రెండింటితో పాటు మరో మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. అవి కూడా పెద్ద సానుకూలతలే. కానీ జట్టు గెలవనప్పుడు వీటితో పెద్దగా పని ఉండదు. ఒకవేళ సానుకూలాంశాలే కావాలనుకుంటే యశస్వి, గిల్, రాహుల్ కూడా సెంచరీలు చేశారని చెప్పాలి. అప్పుడు నాకు నచ్చేది. ఒక పంత్ గురించే అడగడం కరెక్ట్ కాదు. నిజాయితీగా చెప్పాలంటే ఒక మ్యాచ్లో ఐదు సెంచరీలు అనేది గొప్ప ప్రారంభంగా భావిస్తున్నాం’ అని గౌతీ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్లో వ్యక్తిగత ప్రదర్శనలు బాగున్నా ఫలితం సంతృప్తినివ్వలేదన్నాడు.
తొలి టెస్ట్లో ఓడినా బుమ్రాను ఆడించే ప్రణాళికల్లో పెద్దగా మార్పులేదన్నాడు. మూడు టెస్ట్ల కంటే ఎక్కువ ఆడమని ఒత్తిడి చేయబోమన్నాడు. ‘బుమ్రాపై పని భారాన్ని బట్టే మా నిర్ణయాలు ఉంటాయి. అతని శరీరం ఎలా స్పందిస్తుందో చూద్దాం. మిగతా మ్యాచ్ల్లో ఏ రెండు ఆడతాడో మేం ఇంకా నిర్ణయించలేదు. ఇప్పటికైతే మెరుగైన బౌలర్లు ఉన్నారనే నమ్మకంతోనే ఉన్నాం. నమ్మకంతో తుది జట్టును ఎంపిక చేస్తాం. అనుభవం లేని బౌలర్లైనా రాబోయే రోజుల్లో వాళ్లే మెరుగవుతారు. తొలి టెస్ట్లోనూ నాలుగు, ఐదో రోజు కూడా మేం మ్యాచ్ గెలుస్తామనే నమ్మకంతోనే ఉన్నాం. ఈ కుర్రాళ్లే రాబోయే రోజుల్లో మరింత రాణిస్తారని ఆశిస్తున్నాం. యంగ్ బౌలర్లకు కాస్త సమయం ఇవ్వాలి.
గతంలో 40 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన నలుగురు పేసర్లు ఉండేవారు. వన్డే, టీ20ల్లో ఇది అంత ప్రభావం చూపదు. కానీ ఆసీస్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాకు వెళ్లినప్పుడు మాత్రం ఈ అనుభవం చాలా ముఖ్యం. ప్రతి మ్యాచ్ తర్వాత బౌలర్లను అంచనా వేయడం ప్రారంభిస్తే బౌలింగ్ దాడిని అభివృద్ధి చేసుకోలేం. బుమ్రా, సిరాజ్కు అనుభవం ఉన్నా మిగతా వాళ్లకు నైపుణ్యం ఉంది. వాళ్లకు మద్దతు ఎప్పుడూ ఉంటుంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీలో గిల్ మరింత మెరుగవుతాడన్నాడు. రాబోయే రోజుల్లో అతను కచ్చితంగా విజయవంతమవుతాడని ఆశిస్తున్నాని చెప్పాడు. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ స్పష్టం చేశాడు.