‘సిగ్గుపడుతున్నాను.. క్షమించండి’.. ప్రధాని మోదీని దూషించిన టీనేజ్ అమ్మాయి పశ్చాతాప వీడియో !

‘సిగ్గుపడుతున్నాను.. క్షమించండి’.. ప్రధాని మోదీని దూషించిన టీనేజ్ అమ్మాయి పశ్చాతాప వీడియో !

నోయిడా: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జూలై 23న జరిగిన నిరసనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీనేజర్ రుచికా సింగ్‌ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె ప్రధాని మోదీకి చేతులు జోడించి క్షమాపణ చెప్పింది. నిరసనలో ఉన్న ఇతరుల ప్రభావానికి లోనయ్యానని, ఉద్రేకంలో తాను అలా మాట్లాడానని తెలిపింది. వైరల్ అవుతున్న క్లిప్‌లో, తన వయసు 15 ఏళ్లని, కన్నాట్ ప్లేస్ సందర్శించిన తర్వాత స్నేహితులతో కలిసి నిరసనలో భాగమైనట్లు రుచికా సింగ్ చెప్పింది.

తాను తోటి వ్యక్తుల ప్రభావానికి లోనయ్యానని, తన వయసు కేవలం 15 ఏళ్లని.. తాను చేసింది క్షమించదగినది కాదని, తాను చాలా చెడ్డ మాటలు మాట్లాడానని వీడియోలో రుచికా పశ్చాతాపానికి లోనైంది. ఈ తప్పును తన 'మొదటి, చివరి తప్పు'గా చెప్పిన ఆమె.. యావత్ దేశానికి క్షమాపణలు చెబుతున్నానని, తనకు చాలా సిగ్గుగా ఉందని.. తనను తాను చూసుకోలేకపోతున్నానని, దయ చేసి క్షమించండని రుచికా సింగ్ భావోద్వేగానికి లోనైంది. అయితే.. ఈ వీడియో నిజమైనదేనా లేక AI జనరేటెడ్ వీడియోనా అనే సందేహం వ్యక్తమైంది.

జంతర్ మంతర్ నిరసనల్లో తనపై అభ్యంతరకరమైన నినాదాలు చేసిన విద్యార్థులను తాను క్షమించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనను, తన దివంగత తల్లిని ఉద్దేశించి చేసిన నినాదాలు తీవ్రంగా బాధించినప్పటికీ, యువత కఠిన శిక్షను ఎదుర్కొనే బదులు తమ తప్పుల నుంచి నేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధాన మంత్రి అన్నారు.

ఇదిలా ఉండగా.. నిరసన సందర్భంగా అభ్యంతరకర నినాదాలు చేశారన్న ఆరోపణలపై జూలై 29న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తదుపరి దర్యాప్తు కోసం ఈ కేసును ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు ప్రకారం.. ప్రధానమంత్రిపై దుర్భాషలాడి, రాజ్యాంగ పదవి గౌరవాన్ని కించపరిచారని, ఉద్దేశపూర్వకంగా దురభిప్రాయాలను రెచ్చగొట్టి శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించారని రుచికా సింగ్పై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద కేసు నమోదు చేశారు.