మేడిపల్లి, వెలుగు : ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని.. దీనిపై సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. సమ్మెలో భాగంగా ఉప్పల్ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆయన మద్దతు పలికారు. కాంగ్రెస్ పెద్దలు..ఎన్నికల వేళ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారన్నారు.
గెలిచాక మాట మార్చారని ఆరోపించారు. ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీపై మరింత ఆర్థిక భారాన్ని మోపారన్నారు. సంస్థను నిలబెట్టే కార్మికులకు పీఆర్సీ, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రగతి చక్రం ఆగాకే రాష్ట్రం ఏర్పడిందని.. ఆ చక్రాన్ని నడిపించే ఆర్టీసీని కాపాడటం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు.

