
- భూపరిపాలన మొత్తం ఎమ్మార్వో ఆఫీసుల్లోనే..
- నాలా కన్వర్షన్ పవర్స్ ఆర్డీవోల నుంచి తహసీల్దార్లకు..
- పదవులు పెద్దవైనా అధికారాల్లేవని అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోల ఆవేదన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర భూపరిపాలనలో తహసీల్దార్లే సుప్రీంగా మారిపోయారు. కొత్త చట్టంతో వీఆర్వోలను తొలగించటం, తాజా చట్ట సవరణతో ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్ల అధికారాలను కట్ చేసి తహసీల్దార్లకు అప్పగించటంతో.. మండలాల్లో తహసీల్దారే అన్నీ తానై అన్నట్టుగా వ్యవహరించనున్నారు. కొత్త చట్టాలతో తెచ్చిన మార్పులతో రాష్ట్ర సర్కారు భూరికార్డుల నిర్వహణను మొత్తంగా తహసీల్దార్లకే కట్టబెట్టింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్ బుక్స్ జారీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా మార్చే పవర్స్ను వారికే అప్పగించింది. తహసీల్దార్లపై పర్యవేక్షణాధికారులుగా ఉన్న ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లు తమ పదవులు పెద్దవైనా అధికారాల్లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే అధికారాన్ని రాష్ట్ర సర్కారు తహసీల్దార్లకు అప్పగించింది. నాలా కన్వర్షన్గా పేర్కొనే ఈ పవర్ గతంలో రెవెన్యూ డివిజనల్అధికారి (ఆర్డీవో) చేతుల్లో ఉండేది. నాలా కన్వర్షన్లో ఆర్డీవో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో.. వారి పవర్ కట్ చేసి తహసీల్దార్లకు అప్పగించారని తెలిసింది. ఇక ముందు ఎవరైనా తమ భూములను అగ్రికల్చర్ ల్యాండ్ జాబితా నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ జాబితాలోకి మార్చుకోవాలంటే.. ముందు ధరణి వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్లో తహసీల్దార్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎలాంటి అనుమతుల్లేకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా వినియోగిస్తే.. కన్వర్షన్ ట్యాక్స్తోపాటు మరో 50 శాతం మొత్తాన్ని ఫైన్గా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించగానే ఆర్వోఆర్ రికార్డుల్లోని ల్యాండ్ను నాన్అగ్రికల్చర్ ల్యాండ్ గా మార్చేసి.. వ్యవసాయ భూముల జాబితా నుంచి తొలగిస్తారు. వివరాలను నాన్ అగ్రికల్చర్ధరణి పోర్టల్ లో చేర్చి.. ఆ భూమికి మెరూన్ కలర్ పాస్ బుక్జారీ చేస్తారు.
పదవులు పెద్దవాయే.. పవర్ లేదాయే
కొత్త రెవెన్యూ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాక రెవెన్యూ అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో కీలకంగా ఉన్న వీఆర్వోలు, ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్ల అధికారాల్లో ప్రభుత్వం కోత విధించడంతో.. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో వారి పాత్ర నామమాత్రంగా మారింది. రెవెన్యూ కోర్టుల రద్దుతో భూవివాదాలను పరిష్కరించే అధికారం ఆర్డీవోలు, అడిషనల్ కలెక్టర్లకు లేకుండా పోయింది. తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని భూవివాదాలు, తహసీల్దార్ కోర్టు ఇచ్చిన తీర్పులపై ప్రజలు ఆర్డీవోకు అప్పీల్ చేసేవారు. ఇప్పుడా చాన్స్ లేదు. తాజాగా నాలా కన్వర్షన్ పవర్ తప్పించేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.