తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే పని చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఫ్యామిలీ కోసమే పని చేస్తోంది

హైదరాబాద్: ఛేంజ్ హైదరాబాద్ క్యాంపెయిన్ లోకల్ బాడీ ఎన్నికలకే పరిమితం కాదని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు. జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో తేజస్వీ సూర్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మార్పునకు ఛేంజ్ హైదరాబాద్ నాంది అవుతుందన్నారు. ఇవ్వాళ మొత్తం దేశం హైదరాబాద్‌‌ వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్‌‌లో మార్పు తీసుకొచ్చే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సామాన్య బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు.

‘నేను కర్నాటకలోని బెంగళూరు చెందిన వాడ్ని. తెలంగాణకు చెందిన యువతతో పలుమార్లు నేను సంభాషించా. దేశంలోని అత్యంత ప్రతిభావంతులైన, సమర్థులైన, కష్టపడే స్వభావం కలిగిన యువత తెలంగాణ సొంతం. గతేడాది నేను యూఎస్‌‌కు వెళ్లా. అమెరికాలో ఎక్కువ మంది డాక్టర్లు, ఇంజనీర్లు తెలంగాణకు చెందిన వారే. ఐఐటీ, ఐఐఎం లాంటి ఏ ఎంట్రన్స్ పరీక్షలనైనా చూస్కోండి.. వాటిల్లో టాప్-10లో 50 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన వారే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తూ గత కొన్నేళ్లుగా ఇక్కడ సరైన పాలన జరగట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రజలు, యువత కోసం పని చేయడం లేదు. ఈ ప్రభుత్వం కేవలం ఒకే కుటంబం కోసం పని చేస్తోంది. అదే తెలంగాణ సమస్య. నా లాంటి అతి సామాన్యమైన కార్యకర్తలను నేషనల్ లీడర్లను చేసే సత్తా బీజేపీకే ఉంది. అదే బీజేపీ విశిష్టత’ అని తేజస్వీ సూర్య పేర్కొన్నారు.