
న్యూఢిల్లీ: తేజస్ ఎంకే–1ఏ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఒప్పందం కుదుర్చుకున్నది. మొత్తం 97 తేజస్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయనున్నారు.
దీని కోసం రక్షణ శాఖ రూ.62,370 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ మేరకు అటు రక్షణ శాఖ, ఇటు హెచ్ఏఎల్ ప్రతినిధులు ఫైళ్లపై సంతకాలు చేసుకుని ఒప్పందం కుదుర్చుకున్నారు. 97 తేజస్ ఫైటర్ జెట్లలో 68 సింగిల్ సీట్, 29 ట్విన్ సీట్ యుద్ధ విమానాలు ఉన్నాయి.
ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్)కు 2027–28 నుంచి తేజస్ యుద్ధ విమానాల డెలివరీ ప్రారంభం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఆరేండ్లలో మొత్తం 97 తేజస్ ఫైటర్ జెట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చేరుతాయని తెలిపింది. కాగా, ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీఎస్ఎస్)
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నెలలోనే ఈ ఒప్పందం పూర్తయ్యింది. విపత్కర పరిస్థితుల్లో కీలక సేవలందించిన మిగ్ 21 యుద్ధ విమానాలకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ వీడ్కోలు పలకనున్నది. వాటి స్థానంలో తేజస్ ఫైటర్ జెట్లు అందుబాటులోకి వస్తాయి.
తేజస్ తయారీలో 67 దేశీయ భాగాలు
తేజస్ ఎంకే-1ఏ ఫైటర్ జెట్లలో ఉత్తమ్ ఏయిసా రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థలతో పాటు కంట్రోల్ యాక్యుయేటర్లు ఉంటాయి. వీటిలో 64 శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నాయని రక్షణశాఖ పేర్కొంది.
ఈ ప్రాజెక్టు వచ్చే ఆరేండ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలిపింది. మేక్ ఇన్ ఇండియాకు పెద్ద ఊరట. ప్రాజెక్ట్లో 105 సప్లయర్లు భాగస్వాములవుతున్నారు. హెచ్ఏఎల్తో రక్షణ శాఖకు ఇది రెండో ఒప్పందం. రూ.48వేల కోట్లతో 83 తేజస్ యుద్ధవిమానాల కోసం రక్షణ శాఖ 2021, ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్నది.