వేములవాడ, వెలుగు :- తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారిణి చిందం సత్తెమ్మ(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన సత్తెమ్మ.. మిడ్మానేరు నిర్వాసితురాలు కావడంతో వేములవాడ అర్బన్ మండల పరిధిలోని చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలో నివసిస్తున్నారు.
సత్తెమ్మకు తెలంగాణ ఉద్యమమన్నా, బీఆర్ఎస్ పార్టీ అన్నా ఎనలేని మక్కువ. కేటీఆర్ హాజరయ్యే ప్రతి బహిరంగ సభకు, రాజకీయ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యేది. ఆమె చనిపోవడంతో చీర్లవంచలో నిర్వహించిన అంత్యక్రియలకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్వయంగా హాజరై సత్తెమ్మ పాడె మోసి నివాళులర్పించారు. వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, సీనియర్ నేత ఏనుగు మనోహర్రెడ్డి నివాళులర్పించారు.

