- డీపీఆర్ను క్లియర్ చేయండి.. కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
- ఫేజ్ 1లో 45 టీఎంసీలను వాడుకుంటం
- అన్ని ప్యాకేజీల్లోనూ ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తం
- ఏపీ పేరుమార్చి పోలవరం-నల్లమలసాగర్ కడుతున్నది
- ఆ ప్రాజెక్టును కట్టకుండా ఏపీని నిలువరించండి
- కర్నాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
- కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ అందజేసిన రాహుల్ బొజ్జా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులపై పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు, ఏపీ చేపడుతున్న పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టు నిలుపుదల, సమ్మక్క సాగర్ క్లియరెన్సులు తదితర అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం లేఖ రాశారు. ఆ లేఖను కాంతారావుకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇతర అధికారులు అందజేశారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని లేఖలో కేంద్రాన్ని ఉత్తమ్ కోరారు. ప్రాజెక్ట్కు అనుమతులు లేట్ అవుతుండడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలమూరు ప్రాజెక్టుపై ఉన్న అనుమానాలను ఇప్పటికే నాగర్కర్నూల్ సీఈ క్లియర్ చేస్తూ ఈ ఏడాది మే 6న లేఖ రాశారని, లేట్ చేయకుండా అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రాజెక్ట్ ఫేజ్1లో భాగంగా తొలుత మైనర్ ఇరిగేషన్లో వాడుకోకుండా ఆదా చేసిన 45 టీఎంసీల వినియోగానికి అనుమతివ్వాలని లేఖలో మంత్రి ఉత్తమ్ కోరారు. అందుకు తగ్గట్టు ఫేజ్1 డీపీఆర్కు క్లియరెన్సులు ఇవ్వాలన్నారు.
ప్రాజెక్ట్లోని ప్రతి ప్యాకేజ్లో ఐదు పంపుల ద్వారా ఆ నీటిని వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇక, ఫేజ్2లో భాగంగా.. గోదావరి నుంచి ఏపీ డైవర్ట్ చేసే 80 టీఎంసీల్లో తెలంగాణ వాటాగా ఉన్న 45 టీఎంసీలకు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనల అనంతరం క్లియరెన్సులు తీసుకుని పనులు చేపడతామని పేర్కొన్నారు. అందుకు తగ్గట్టు ఫేజ్1 డీపీఆర్కు అనుమతులివ్వాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
పోలవరం నల్లమలసాగర్ను ఆపండి
ఏపీ చేపడుతున్న పోలవరం బనకచర్ల ప్రాజెక్టును పేరు మార్చి పోలవరం నల్లమలసాగర్గా ముందుకు వెళ్తున్నదని, ఆ ప్రాజెక్టును ఆపాలని కేంద్రాన్ని మంత్రి ఉత్తమ్ కోరారు. బనకచర్లపై తెలంగాణ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపిందని, ఫిర్యాదు కూడా చేశామని గుర్తు చేశారు. ఇటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్రలూ అభ్యంతరం తెలిపాయన్నారు. అయినా కూడా ఏపీ ఆ అభ్యంతరాలను పట్టించుకోకుండా అక్టోబర్ 3న డీపీఆర్ తయారీకి టెండర్లను పిలిచిందని తెలిపారు.
అయితే, ఆ తర్వాత టెండర్లను రద్దు చేసి.. బనకచర్ల ప్రాజెక్టు పేరును మార్చిందన్నారు. పోలవరం నల్లమలసాగర్ లింక్గా మార్చి డీపీఆర్కు నవంబర్ 21న టెండర్లను పిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) ఇంకా పరిశీలన దశలోనే ఉందని, కాబట్టి ఏపీ ప్రాజెక్టును చేపట్టకుండా చూడాలని కోరారు. అలాగే, పీఎఫ్ఆర్కు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు ఇవ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోండి
దిగువ రాష్ట్రాలకు నష్టం జరిగేలా కర్నాటక ప్రభుత్వం ఏకపక్షంగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతున్నదని మంత్రి ఉత్తమ్ అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు పెంపు కోసం అక్టోబర్ 9న కర్నాటక ప్రభుత్వం జీవో కూడా ఇచ్చిందన్నారు. డ్యామ్ ఎత్తుపెంపుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఆ స్టే అమల్లో ఉండగానే కర్నాటక ఎత్తు పెంపుపై ముందుకు వెళ్తున్నదని ఆయన ఆరోపించారు.
ఆల్మట్టి ఎత్తు పెంచితే దిగువన ఉన్న తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులకు నీళ్లు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కర్నాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచకుండా నిలువరించాలని, భూసేకరణను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటు సమ్మక్కసాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్కు కూడా త్వరగా క్లియరెన్సులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన కోరారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 వాదనలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఏడు ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద అనుమతులివ్వండి
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్(ఏఐబీపీ) కింద ఏడు ప్రాజెక్టులకు ఇప్పటికే దరఖాస్తు చేశామని, ఆ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్, సీతారామ + సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్, పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్, చిన్నకాళేశ్వరం, మోడికుంటవాగు, చనాక కొరాట ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద అక్టోబర్ 15న దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. ఈ ఏడింటిలో చిన్నకాళేశ్వరం, చనకా కొరాట, మోడికుంటవాగు, సీతారామ–సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు అడ్వైజరీ కమిటీ టెక్నో ఎకనమిక్ అనుమతులకు క్లియరెన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. వాటికి అనుమతులను ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు.
