గవర్నర్​పై హైకోర్టుకెక్కి బొక్కబోర్లా

గవర్నర్​పై హైకోర్టుకెక్కి బొక్కబోర్లా
  • కొద్దిగంటల్లోనే పిటిషన్​ విత్​డ్రా
  • గవర్నర్ ​స్పీచ్​తోనే అసెంబ్లీ ఉంటుందని హామీ
  • గతంలో జరిగినవి రిపీట్‌‌కానియ్యబోమని నివేదన
  • ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌తో మంత్రులు హరీశ్‌‌ రావు,ప్రశాంత్‌‌ రెడ్డి అత్యవసర భేటీ
  • అనంతరం గవర్నర్‌‌ను కలిసిన మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి, అధికారులు

గవర్నర్‌‌ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా..? ఇలా చేసేందుకు రాజ్యాంగంలో ఏ నిబంధన ఉందో ప్రభుత్వమే చెప్పాలి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఏ కోర్టులూ నోటీసులు ఇచ్చేందుకు ఆస్కారం లేదు. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే.. కోర్టులు పరిధి దాటాయని రేపు మీరే అంటారు.–హైకోర్టు

గవర్నర్​నే కాదు..దేశంలో ఏ మహిళ విషయంలోనూ అనుచితంగా మాట్లాడేందుకు వీల్లేదు. గవర్నర్​ విషయంలో ఎమ్మెల్సీ చేసిన కామెంట్లను ప్రభుత్వం ఖండిస్తోంది. విమర్శలనేవి విధానాలపై ఉండాలేగానీ వ్యవస్థలు, వ్యక్తులపై కాదు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్​ ప్రసంగిస్తారు. గవర్నర్‌‌ ప్రసంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.
–రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్​ దుష్యంత్​ దవే

హైదరాబాద్‌‌, వెలుగు: గవర్నర్‌‌ తమిళిసైని అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా చేయాలని చూసిన కేసీఆర్‌‌ సర్కారు తలొంచింది. హైకోర్టు ద్వారా బడ్జెట్‌‌కు గవర్నర్​ నుంచి ఆమోదం పొందేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. తనంతట తాను హైకోర్టు వరకు వెళ్తే గానీ సర్కారుకు వాస్తవం బోధపడలేదు. న్యాయస్థానం సూచనలతో దిగొచ్చి.. గవర్నర్‌‌ ప్రసంగంతోనే బడ్జెట్‌‌ సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్‌‌ పై తమ లీడర్లు చేసిన కామెంట్లు తప్పని ఒప్పుకుంది. విమర్శలు సహా గతంలో జరిగినవేవి రిపీట్‌‌ కాకుండా చూస్తామని కోర్టుకు విన్నవించింది. బడ్జెట్‌‌ను ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సోమవారం హైకోర్టులో రాష్ట్ర సర్కార్​ లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్​ను దాఖలు చేసి.. కొన్ని గంటల్లోనే విత్‌‌ డ్రా చేసుకుంది.  గవర్నర్‌‌ స్పీచ్‌‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందని, బడ్జెట్​ సమావేశాలను గవర్నర్​ను ఆహ్వానిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ దుష్యంత్‌‌ దవే హైకోర్టుకు నివేదించారు. అనంతరం ప్రగతి భవన్‌‌లో మంత్రులు హరీశ్‌‌రావు, ప్రశాంత్‌‌ రెడ్డితో సీఎం కేసీఆర్‌‌ అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ డాక్టర్‌‌ నర్సింహాచార్యులు, ఫైనాన్స్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి రాజ్‌‌ భవన్‌‌కు వెళ్లి గవర్నర్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బడ్జెట్‌‌కు ఆమోదం తెలపడంతో పాటు పెండింగ్‌‌ బిల్లులు క్లియర్‌‌ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

గవర్నర్లకు నోటీసులు ఇవ్వలేం: హైకోర్టు​

రాష్ట్ర బడ్జెట్‌‌కు ఆమోదం తెలపాలని కోరుతూ ఈ నెల 21న గవర్నర్‌‌కు ఫైల్​ పంపినా ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని, దీనికి ఆమోదం తెలిపేలా గవర్నర్‌‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సోమవా రం హైకోర్టులో సీఎస్‌‌ శాంతికుమారి లంచ్‌‌ మోషన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ టి.తుకారాంజీతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ పిటిషన్‌‌ను విచారణ చేపట్టింది. చీఫ్‌‌ జస్టిస్‌‌ కల్పించుకుని.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు ఏ కోర్టులూ నోటీసులు ఇచ్చేందుకు ఆస్కారం లేదనే నిబంధనను గుర్తుచేశారు. రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు, సుప్రీంకోర్టు గవర్నర్, రాష్ట్రపతికి ఏవిధంగా నోటీసులు జారీ చేయగలవని ప్రశ్నించారు. ‘‘గవర్నర్‌‌కు ఆదేశాలు ఇచ్చేందుకు రాజ్యాంగంలో ఆస్కారం లేదు. కోర్టు గవర్నర్‌‌కు నోటీసు ఇవ్వగలదా..? దీనిపై ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి” అని డివిజన్‌‌ బెంచ్‌‌  స్పష్టం చేసింది. గవర్నర్‌‌ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయవచ్చా.. ఇలా చేసేందుకు రాజ్యాంగంలో ఏ నిబంధన ఉందో చెప్పాలని సూచించింది. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే కోర్టులు పరిధి మితిమీరాయని రేపు మీరే అంటారని ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రెండు రాజ్యాంగ వ్యవస్థలు విభేదాల పేరుతో కోర్టుకు రావడం కంటే ఆ రెండు వ్యవస్థల ప్రతినిధులు కూర్చుని, సామరస్యంగా సమస్యను కొలిక్కి తెచ్చుకోవాలని హైకోర్టు సూచించింది. 

విధి లేకనే వచ్చినం: రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ దుష్యంత్‌‌ దవే 30 నిమిషాలకు పైగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీ, కౌన్సిల్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌‌ విధిగా ఆమోదం తెలియజేయాలని అన్నారు. ఈ నెల 21న గవర్నర్‌‌కు లేఖ రాసినా ఇప్పటివరకు ఆమోదించలేదని, గవర్నర్‌‌ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని తెలిపారు. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను గవర్నర్‌‌ ఆమోదించి తీరాలని అన్నారు. ‘‘రాష్ట్రపతి/గవర్నర్‌‌కు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటే వాటి ప్రభావం ప్రభుత్వ సిఫార్సుల అమలుపై ఉండకూడదు. రాజ్యాంగపరమైన అభిప్రాయాలతోనే వాళ్లు విధులు నిర్వహించాలి. కేబినెట్‌‌ తీర్మానం లేదా శాసనసభ బిల్లుల ఆమోదం వంటివి చేస్తే గవర్నర్‌‌ ఆమోదించి తీరాలి. గవర్నర్‌‌ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. రాజ్యాంగానికి అతీతంగా ఎవ్వరూ ఉండకూడదని సుప్రీంకోర్టు పలు తీర్పులో చెప్పింది” అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలేనని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనని చెప్పారు. ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య అభిప్రాయభేదాలు రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవడం లేదన్నారు. సున్నితమైన ఈ సమస్యకు సామరస్య పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతోనే విధిలేని పరిస్థితుల్లో హైకోర్టుకు రావాల్సివచ్చిందని వివరించారు. ప్రభుత్వంలో రాజ్యాంగపరమైన సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే గవర్నర్‌‌ స్వతంత్రంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘గవర్నర్‌‌ సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపించకూడదు. బడ్జెట్‌‌ అనేది రాష్ట్ర ప్రజలతో ముడిపడిన అంశం. దీని విషయంలో గవర్నర్‌‌ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం రాజ్యాంగ బాధ్యతలను విస్మరించడమే అవుతుంది. బడ్జెట్, ద్రవ్యవినిమయ బిల్లు వంటివి ఆమోదం పొందకపోతే ఏప్రిల్‌‌ 1 నుంచి ఖజానా నుంచి లావాదేవీలు నిర్వహించేందుకు ఆస్కారం లేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి.. బడ్జెట్‌‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా గవర్నర్‌‌ ఆమోదం తెలియజేసేలా ఉత్తర్వులు ఇవ్వాలి” అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్​ దవే కోరారు. ఈ దశలో సీజే విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.

లీడర్లు ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నరు: గవర్నర్​ కార్యదర్శి తరఫు అడ్వకేట్​

లంచ్‌‌ బ్రేక్‌‌ అనంతరం గవర్నర్‌‌ కార్యదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ అశోక్‌‌ ఆనంద్‌‌ కుమార్​ వాదనలు వినిపించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోవాలనే ఆలోచన గవర్నర్‌‌కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే గతేడాది బడ్జెట్‌‌ సమావేశాలు నిర్వహించారని, గవర్నర్‌‌ను ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. రిపబ్లిక్‌‌ డే వేడుకలకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదని, హైకోర్టు ఆదేశాల తర్వాత రాజ్‌‌భవన్‌‌లో ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. సంప్రదాయం ప్రకారం రిపబ్లిక్‌‌ డే సాయంత్రం ‘ఎట్‌‌ హోం’ కార్యక్రమానికి వ్యక్తిగతంగా ఆహ్వానించినా సీఎం హాజరుకాలేదని, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఏదైనా సమస్య ఉంటే  చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌‌ పట్ల ప్రభుత్వం, సీఎం వ్యవహరిస్తున్న తీరు హుందాగా లేదని పేర్కొన్నారు. రాజ్యాంగ బాధ్యతలు నిర్వహించే గవర్నర్‌‌ విషయంలో ప్రభుత్వం, సీఎం అనుసరించే విధానం సబబుగా లేదన్నారు. ఏటా బడ్జెట్‌‌ సెషన్‌‌ గవర్నర్‌‌ స్పీచ్‌‌తో ప్రారంభమవుతుందని, గతేడాది తొలిసారి గవర్నర్‌‌ ప్రసంగం లేకుండానే సెషన్‌‌ నిర్వహించారని పేర్కొన్నారు. ఈ ఏడాది సెషన్‌‌ను అలాగే నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారని, దీనిపై గవర్నర్‌‌ లేఖ రాసినా ప్రభుత్వం నుంచి రిప్లయ్‌‌ రాలేదన్నారు. గత ఏడాది బడ్జెట్‌‌ సమావేశాల నేపథ్యంలో గవర్నర్‌‌ లేఖ రాసినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఇది రాజ్యాంగ విధానం కానేకాదని స్పష్టం చేశారు. గవర్నర్‌‌కు ఉద్దేశాలు ఏమీ లేవని, రాజ్యాంగంలోని నిబంధనలకు తగ్గట్టుగా బడ్జెట్‌‌ సెషన్‌‌ నిర్వహించేలా గవర్నర్‌‌ ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. 

ఇరుపక్షాల నడుమ చర్చలు

హైకోర్టు సూచనలకు మేరకు అడ్వకేట్​ జనరల్​(ఏజీ) ఆఫీసులో ఏజీ బీఎస్‌‌ ప్రసాద్, అదనపు ఏజీ రామచంద్రరావు, సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వకేట్​దుష్యంత్‌‌ దవే, గవర్నర్‌‌ కార్యదర్శి తరఫు అడ్వకేట్​అకోశ్‌‌ ఆనంద్‌‌ కుమార్‌‌  మధ్య చర్చలు జరిగాయి. చర్చల్లో అంశాలను హైకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్​ తీసుకెళ్లారు. బడ్జెట్‌‌ ప్రవేశపెడుతున్నట్లుగా గవర్నర్‌‌ను ఆర్థిక మంత్రి ఆహ్వానిస్తారని చెప్పారు. కేబినెట్‌‌ ఆమోదంతో గవర్నర్‌‌ స్పీచ్‌‌ కాపీ రెడీ చేసి గవర్నర్‌‌కు పంపాలని, ఆ స్పీచ్‌‌ని గవర్నర్‌‌ అసెంబ్లీలో చదవాలని కూడా చర్చల్లో అంగీకారం కుదిరిందన్నారు. 
పెండింగ్‌‌లోని బిల్లులకు గవర్నర్‌‌ ఆమోదం చెప్పా లని, లేకపోతే గవర్నర్‌‌ సందేహాలను ఆయా డిపార్ట్‌‌మెంట్ల ఆఫీసర్లు క్లారిఫై చేయాలని కూడా చర్చల్లో తుది నిర్ణయానికి వచ్చినట్లు వివరించారు. 

ఎమ్మెల్సీ కామెంట్లను ఖండిస్తున్నం: ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్‌‌ దవే స్పందిస్తూ.. ‘‘గవర్నర్​నే కాదు..దేశంలో ఏ మహిళ విషయంలోనూ అనుచితంగా మాట్లాడేందుకు వీల్లేదు” అని ఒప్పుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభుత్వంలో భాగం కాదని, అయినా గవర్నర్​ విషయంలో ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. విమర్శలు విధానాలపై ఉండాలేగానీ వ్యవస్థలు, వ్యక్తులపై కాదని అన్నారు. గవర్నర్‌‌ కార్యదర్శి తరఫు అడ్వకేట్​చెప్పిన విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు. ఇకపై అలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగినవి ఇకపై రిపీట్‌‌ కాబోవని చెప్పారు. గవర్నర్‌‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, గవర్నర్‌‌ ప్రసంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుందని తెలిపారు. ఇరుపక్షాల అడ్వకేట్లు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పిటిషన్‌‌పై విచారణ ముగిస్తున్నట్లు చీఫ్‌‌ జస్టిస్‌‌ ప్రకటించారు. దీనిపై గవర్నర్‌‌ సెక్రటరీ తరఫు అడ్వకేట్​ అశోక్‌‌ ఆనంద్‌‌ కల్పించుకుని.. రిట్‌‌ను గవర్నమెంట్‌‌ వాపస్‌‌ తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అందుకు సీజే సమ్మతిస్తూ విచారణను ముగించారు. 

ఎమ్మెల్సీ కామెంట్లను ఖండిస్తున్నం: ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం తరఫు అడ్వకేట్‌‌ దవే స్పందిస్తూ.. ‘‘గవర్నర్​నే కాదు..దేశంలో ఏ మహిళ విషయంలోనూ అనుచితంగా మాట్లాడేందుకు వీల్లేదు” అని ఒప్పుకున్నారు. ఎమ్మెల్సీ ప్రభుత్వంలో భాగం కాదని, అయినా గవర్నర్​ విషయంలో ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పారు. విమర్శలు విధానాలపై ఉండాలేగానీ వ్యవస్థలు, వ్యక్తులపై కాదని అన్నారు. గవర్నర్‌‌ కార్యదర్శి తరఫు అడ్వకేట్​చెప్పిన విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని పేర్కొన్నారు.ఇకపై అలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో జరిగినవి ఇకపై రిపీట్‌‌ కాబోవని చెప్పారు. గవర్నర్‌‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, గవర్నర్‌‌ ప్రసంగాన్ని ప్రభుత్వం సిద్ధం చేస్తుందని తెలిపారు. ఇరుపక్షాల అడ్వకేట్లు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పిటిషన్‌‌పై విచారణ ముగిస్తున్నట్లు చీఫ్‌‌ జస్టిస్‌‌ ప్రకటించారు. దీనిపై గవర్నర్‌‌ సెక్రటరీ తరఫు అడ్వకేట్​ అశోక్‌‌ ఆనంద్‌‌ కల్పించుకుని.. రిట్‌‌ను గవర్నమెంట్‌‌ వాపస్‌‌ తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. అందుకు సీజే సమ్మతిస్తూ విచారణను ముగించారు.