పల్లె పరిశ్రమకు దన్ను..కుటీర, చిన్న పరిశ్రమలకు రూ.984 కోట్లు

పల్లె పరిశ్రమకు దన్ను..కుటీర, చిన్న పరిశ్రమలకు రూ.984 కోట్లు
  • బడ్జెట్ లో పెరిగిన కేటాయింపులు
  • మొత్తంగా ఇండస్ట్రీస్​కు రూ.3,747 కోట్లు ప్రతిపాదన
  • ఇండస్ట్రీస్​ ఇన్సెంటివ్స్​ కోసం అదనంగా రూ.1,835 కోట్లు

హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో పరిశ్రమలకు ప్రభుత్వం దన్నుగా నిలిచింది. బడ్జెట్​లో నిధులు పెంచింది. గ్రామాల్లోని కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలకు రూ.984.83 కోట్లు కేటాయించింది. నిరుడు బడ్జెట్​లో రూ.670.95 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు రూ.313.88 కోట్లు అదనంగా ప్రతిపాదించింది. చిన్నపరిశ్రమల్లో హ్యాండ్లూమ్​అండ్​ టెక్స్​టైల్స్​కు రూ.241.96 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

నేత కార్మికులకు బీమా కోసం కేటాయింపులను రూ.11.25 కోట్ల నుంచి రూ.17.79 కోట్లకు పెంచింది. బడ్జెట్​లో ఇండస్ట్రీస్​ డిపార్ట్​మెంట్​కు ప్రభుత్వం మొత్తంగా రూ.3,747 కోట్లు కేటాయించింది. అందులో భారీ, మధ్య తరహా పరిశ్రమలకూ రూ.1,134.53 కోట్లు కేటాయించింది. నిరుడు రూ.896.30 కోట్లు ఇవ్వగా.. ఇప్పుడు నిధులు పెరిగాయి. షుగర్స్​ కమిషనర్​కు రూ.138.75 కోట్లు ప్రతిపాదించింది. రావిర్యాలలోని ఈ సిటీకి రూ.19.70 కోట్లు, మహేశ్వరంలో ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రానిక్​ సిటీ కోసం రూ.26.47 కోట్లు కేటాయించింది. 

ఇండస్ట్రియల్​ ప్రమోషన్​కు ఇన్సెంటివ్స్​..

రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్స్​ చెల్లింపుల కోసం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. అందుకు ఇండస్ట్రియల్​ ప్రమోషన్​ ఇన్సెంటివ్స్​ కోసం రూ.1,835 కోట్లు కేటాయించింది. అందులో గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.655 కోట్లు ఇన్సెంటివ్స్​గా ఇవ్వనుంది. మరోవైపు పరిశ్రమలకు పవర్​ సబ్సిడీ కోసం రూ.250 కోట్లు కేటాయించింది. నిమ్జ్​ భూసేకరణకు రూ.96.50 కోట్లను ప్రతిపాదించింది. శాండ్​ మైనింగ్​ కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల కేటాయింపులు చేసింది.