మార్చ్ 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చ్ 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 7వ తేదీ నుంచి శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీ సాయంత్రం 5గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం కానుంది. 7న ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున బీఏసీ సమావేశం నిర్వహించనున్నరు. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎజెండా తదితర అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. భారత రాజ్యాంగంలోని 176(1) ఆర్టికల్ ప్రకారం కొత్తగా కొలువుదీరిన అసెంబ్లీ మొదటి సమావేశంతో పాటు ఏటా శాసన సభా తొలి సమావేశాల్లో సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో శాసన మండలి కూడా ఉంటే ఉభయ సభలను హాజరుపరిచి గవర్నర్ ప్రసంగిస్తారు. 

బడ్జెట్ సమావేశాల నిర్వాహణ తేదీల ఖరారు కోసం ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సెషన్కు సంబంధించి మంత్రులు అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం తేదీ ఖరారు చేశారు. భేటీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, శాసన సభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.