రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు ప్రారంభం కానున్నాయి.   మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీలో  గవర్నర్ తమిళి సై  ప్రసంగించనున్నారు.  రెండేళ్ల అనంతరం   బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్   ప్రసంగించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాల్లో సాంకేతిక కారణాల వల్ల  గవర్నర్ ప్రసంగించలేదు.  ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం వద్దని ప్రభుత్వం భావించింది.  కానీ  హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని  ప్రకటించింది. 

3న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసే ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ 4న అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు. 6న ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 7న బడ్జెట్‌ అధ్యయనం చేయడానికి సెలవు ఇస్తారు. 8వ తేదీ నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ నిర్వహించి అప్రాప్రియేషన్‌ బిల్లుకు ఆమోదంతో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయనున్నారు. ఈ సెషన్‌లో కాగ్‌ రిపోర్టును ప్రవేశపెట్టనున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహించే అవకాశముందని సమాచారం.

మరో వైపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.