
- రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు
- ఎంప్లాయీస్ ఆరోగ్య భద్రతకు సీఎస్ అధ్యక్షతన ట్రస్ట్
- ఉద్యోగుల బకాయిలు ఇకపై ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లింపు
- ఎన్నికల టైంలో బదిలీ అయిన ఆఫీసర్లు పాత స్థానాలకు
- అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 2 లక్షలకు పెంపు
- మూడు కారిడార్లలో రూ. 19,579 కోట్లతో మెట్రో విస్తరణ
- హ్యామ్ విధానంలో రూ. 33 వేల కోట్లతో 13,137 కి.మీ. మేర రోడ్లు
- వివిధ జిల్లాల్లో టీజీఐఐసీకి ప్రభుత్వ భూముల బదిలీ
- కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్సింగ్ పేరు
- వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, పొన్నం
- సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన 5 గంటలు సాగిన మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు (కరువు భత్యాలు) ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. వీటిలో ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది. 2023 జనవరి ఒకటో తేదీ నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను వెంటనే చెల్లించనుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు బకాయి పడ్డ ఏరియర్స్ను 28 వాయిదాల్లో ఇవ్వనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతినెలా రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ ట్రస్ట్ ఉంటుంది. అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్ట్కు ప్రతినెలా ఉద్యోగి సాలరీలో నుంచి రూ.500 చొప్పున జమ చేస్తారు. ఆ మొత్తా నికి సమానమైన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హ్యామ్ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. మూడు కారిడార్లలో మెట్రో విస్తరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్లో మెట్రో విస్తరణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన జాయింట్ స్టేట్ కౌన్సిల్, అసోసియేషన్లకు గుర్తింపు ఇచ్చేందుకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సెక్రటేరియెట్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉద్యోగుల సంక్షేమం, రోడ్ల అభివృద్ధి, మెట్రో విస్తరణ, సన్న వడ్లకు బోనస్ ప్రోత్సాహం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభా కర్ మీడియాకు వివరించారు.
రిటైర్డ్ ఉద్యోగుల సేవలు వినియోగించుకోం
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులో భాగంగా హెల్త్ కార్డుల అమలుకు చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ‘‘చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ప్రతినెల ఉద్యోగులు రూ. 500 చొప్పున జమ చేయగా.. అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ట్రస్టులో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారు” అని భట్టి విక్రమార్క వివరించారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఉద్యోగుల బిల్లుల సమస్యకు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు.
‘‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ప్రతి నెల రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం” అని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డియర్నెస్ అలవెన్సులు (డీఏలు) ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో ఒక డీఏను వెంటనే అమలు చేస్తామని, మరో డీఏను ఆరు నెలల తర్వాత అమలు చేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేసినట్లు, తన అధ్యక్షతన కేబినెట్ సబ్- కమిటీని ఏర్పాటు చేసినట్లు భట్టి గుర్తుచేశారు.
ఉద్యోగ సంఘాల డిమాండ్లలో ఒకటైన సెక్రటేరియెట్లో 12.5% కోటా ఉండాలన్న అంశానికి కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మెడికల్ ఇన్ వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల సేవలు తిరిగి వినియోగించుకోవద్దనే దానికి సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీల ఉద్యోగులకు గ్రేడింగ్
గ్రామ పంచాయతీలో పనిచేసే ఉద్యోగులకు ఆయా పంచాయతీలను అనుసరించి గ్రేడింగ్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి ప్రకటించారు. ఉద్యోగుల ప్రమోషన్స్కు సంబంధించి డీపీసీ ఏర్పాటు చేస్తామని, క్రమం తప్పకుండా ప్రమోషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల సమయంలో బదిలీపై వచ్చిన ఉద్యోగులు, అధికారులను వారి పాత జిల్లాలకు వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 2 లక్షలకు పెంచినట్లు వివరించారు. ‘‘అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్తో పాటు వాహనాల హద్దులు పెంచాలని నిర్ణయించాం. జీవో 317ని కూడా ఎగ్జామిన్ చేస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
ఎర్త్ సైనెన్స్కు మన్మోహన్సింగ్ పేరు
కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సన్నవడ్లకు బోనస్తో రైతులకు లబ్ధి చేకూరిందని, ఈ సన్న వడ్లకు బోనస్ను కొనసాగించాలని మంత్రివర్గం తీర్మానించిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం కింద గత ఏడాది చనిపోయిన 385 మంది మహిళ సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున రూ. 38.5 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా నేరుగా స్త్రీనిధి ద్వారా బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. భవిష్యత్లోనూ ఇలాగే ఇవ్వనున్నట్లు తెలిపారు. మెట్రో విస్తరణకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు సహకరించాలని ఆయన కోరారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో ఫామ్హౌస్లకు మంచి రోడ్లు వేసుకుని.. ఇతర ప్రాంతాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు బీటీ రోడ్లు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్ రోడ్లు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర హెడ్ క్వార్టర్కు అంటే హైదరాబాద్కు నాలుగు లేన్లు రోడ్లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.
టీజీఐఐసీకి భూముల బదిలీ
పారిశ్రామికాభివృద్ధి కోసం వివిధ జిల్లాల్లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్పెషల్ ఎక్సైజ్ సెస్ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విద్యాశాఖలో మరో డైరెక్టర్ నియామకం చేపట్టాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ములుగు జిల్లా ఇంచర్లలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 12 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
రెండేండ్లలో 13,137 కి.మీ రోడ్లు
పంచాయతీ రాజ్ రోడ్లకు రూ. 16 వేల 780 కోట్లు, ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 16 వేల 414 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హ్యామ్ విధానంలో రెండేండ్లలో వీటి నిర్మాణంతో పాటు 15 ఏండ్ల మెయింటెనెన్స్ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది. పార్లమెంట్ ఒక యూనిట్గా లేదా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
19,579 కోట్లతో మెట్రో విస్తరణ
హైదరాబాద్ సిటీలో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును (86.1 కిలోమీటర్లకు) రూ.19,579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్తో చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో కారిడార్–1లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ, కారిడార్-2 జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ, కారిడార్- 3 జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కి.మీ మేర మెట్రో నిర్మాణం చేపడతారు.