
తెలంగాణ కేబినెట్ జులై 31వ తేదీ సోమవారం భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఆగస్టు 3 గురువారం నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చర్చించాల్సిన కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని కీలక అంశాలపై చర్చ..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్ లో మొత్తం 40 నుంచి 50 అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలు, వరదలు, ప్రభావిత ప్రాంతాలు, ఆయా పరిస్థితులపై మంత్రి మండలిలో చర్చిస్తారని సమాచారం. కుండపోతగా కురిసిన వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోయి రవాణ మార్గాలకు జరిగిన తీవ్ర నష్టంపై కేబినెట్ అంచనా వేయనుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్లను పునరుద్దరించడం కోసం చేపట్టాల్సిన చర్యలపైనా కేబినెట్ లో చర్చించనున్నారు. అలాగే పలు ప్రాజెక్టులకు సంబంధించి నీటి సామర్ధ్యం, ప్రస్తుత నీటిమట్టం వంటి అంశాలపై చర్చించే ఛాన్సుంది. ఈ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా జరగనుందని... ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం.