8 రోజులు ఢిల్లీలనే.. ఇవాళే హైదరాబాద్ కు కేసీఆర్

8 రోజులు ఢిల్లీలనే.. ఇవాళే హైదరాబాద్ కు కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. హైదరాబాద్ కు చేరుకున్న ఆయన నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు. గత ఎనిమిది రోజులుగా కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. బీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులను స్వయంగా కేసీఆర్ పరిశీలించారు. సర్దార్ పటేల్ మార్గ్ లో ఓ బంగళాను అద్దెకు తీసుకుని కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

నిపుణుల సూచనల మేరకు పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరును ‘బీఆర్ఎస్’ (భారత రాష్ట్ర సమితి)గా మారుస్తూ.. అక్టోబర్ 5న జరిగిన టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశంలో తీర్మానం చేశారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచి.. పలువురిని అరెస్టు చేసింది. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. బోయినపల్లి అభిషేక్ ను సీబీఐ అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. కవితతో ఢిల్లీకి వెళ్లడం కీలకంగా మారింది.