
హైదరాబాద్, వెలుగు: పోగొట్టుకున్న, దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాష్ట్ర సీఐడీ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సహా దక్షిణాది రాష్ట్రాల పోలీసులతో పోలిస్తే 77.98 శాతం రికవరీ సాధించారు. సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ప్రారంభించిన నాటి నుంచి ఈనెల 19 నాటికి 78,114 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్లో 11,879 ఫోన్లను రికవరీ చేశారు. సైబరాబాద్ పరిధిలో 10,385, రాచకొండ పరిధిలో 8,681 ఫోన్లను రికవరీ చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా యూనిట్లలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ల బ్లాకింగ్, ట్రేసింగ్ కొనసాగుతోంది.
చోరీకి గురైన లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ 2022 సెప్టెంబర్ 5న కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో సీఈఐఆర్ పోర్టల్ను పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించింది. మన రాష్ట్రంలో ఈ పోర్టల్ ను 2023 ఏప్రిల్ 19న ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 యూనిట్లలోని 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులో పెట్టారు. ఈ పోర్టల్ ఆలస్యంగా అమల్లోకి వచ్చినా ఫలితాల సాధనలో మన రాష్ట్రం ముందుంది. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులతో మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసి రోజువారీ ట్రాకింగ్ రిపోర్టులను పరిశీలిస్తూ ట్రేస్ చేస్తున్నది.