మహారాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి ఇంటికి మంచినీళ్లిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. మహారాష్ట్ర ఔరంగాబాద్లో బీఆర్ఎస్ బహిరంగ సభ మాట్లాడిన కేసీఆర్.. బీఆర్ఎస్ ఓ మతానికో ప్రాంతం కోసం ఆవిర్భవించలేదని.. మార్పు కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ బీఆర్ఎస్ నినాదం అని అన్నారు. మేకిన్ ఇండియా జోకిన్ ఇండియాగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మహారాష్ట్ర ఎందుకు వచ్చారని బీజేపీ ప్రశ్నిస్తుందని.. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ అమలు చేస్తే తాను ఇక్కడకు రానని సవాల్ విసిరారు. కొత్త పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదని మోడీని ప్రశ్నించారు కేసీఆర్ ప్రశ్నించారు. కేంద్రం ప్రైవేటీకరించిన ప్రతీ సంస్థలను నేషనలైజ్ చేస్తామని చెప్పారు కేసీఆర్.
మహారాష్ట్రలో ఎన్ని నదులు ప్రవహిస్తున్నా ఈ కరువు ఎందుకని ప్రశ్నించారు కేసీఆర్. ఔరంగాబాద్ అకొల్లలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. దేశంలో సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని....పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని విమర్శించారు. మనదేశంలో ఏం జరుగుతుంతో అర్థం కావడం లేదన్నారు. ఎంత త్వరగా మేలుకుంటే అంత త్వరగా బాగుపడ్తమన్నారు.
13 నెలలు ఢిల్లీలో రైతులు నిరసనలు చేసినా కేంద్రంలో చలనం లేదన్నారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలు రద్దు అంటూ మోడీ క్షమాపణలు చెప్పి చేతులు దులుపున్నారని విమర్శించారు. దేశ రాజధానిలో 770 మంది రైతులు చనిపోవడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. ఎంత మంది ప్రధానులు మారినా మన కష్టాలు పోలేదని.. దేశంలో మార్పు రావాల్సిందేనని చెప్పారు. అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్..అయినా అభివృద్ధిలో వెనుకబడే ఉన్నామని తెలిపారు. దేశంలో పెను విప్లవం వస్తేనే అభివృద్ధి సాధ్యమని కేసీఆర్ అన్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో త్వరలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మిస్తామని చెప్పారు కేసీఆర్.. నిజాయితీతో చేసే తమ పోరాటానికి తప్పకుండా విజయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలకు భయపడితే ఏ పార్టీకి కూడా మనుగడ ఉండదన్నారు. మహారాష్ట్రలో కరెంట్,నీటి సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఆటంకాలు వచ్చిన తాము భయపడబోమని.. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. నెహ్రూ హయాంలోనే దేశం కాస్తో కూస్తో అభివృద్ధి చెందిందని.. తర్వాతి ప్రభుత్వాలు ఓ ప్రణాళిక లేకుండా పాలించాయని చెప్పారు. భారత్ కంటే చిన్న దేశాల్లో అద్భుతమైన రిజర్వాయర్లు ఉన్నాయని వెల్లడించారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం కొత్త చట్టాలు తేవాల్సిందేనని కేసీఆర్ అన్నారు. లేకపోతే ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితులే ఉంటాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ఇది తెలంగాణ చేసి చూపించామన్నారు.