రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి..సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి

రూ.2 లక్షల రుణమాఫీ ఒకేసారి..సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి
  • విధివిధానాలపై త్వరలోనే జీవో రైతుభరోసాపై డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ
  • జులై 15 కల్లా కమిటీ నివేదిక..దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం
  • గత ప్రభుత్వం రెండు టర్మ్​లలో చేసిన రుణమాఫీ మొత్తం 28 వేల కోట్లే
  • నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్ 
  • కటాఫ్ తేదీ  2018 డిసెంబర్​12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు..
  • మొత్తం రుణమాఫీ రూ.31 వేల కోట్లు

హైదరాబాద్, వెలుగు : రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే తప్పదని, వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో రుణమాఫీ, రైతుభరోసాపై ప్రధానంగా చర్చించారు.

మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆయన చెప్పారు. ‘‘మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. సోనియా మాట ఇస్తే అది శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది” అని తెలిపారు. 

‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో టర్మ్​లో 2018 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 11 వరకు కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేట్ పెట్టి రుణమాఫీ చేసింది. మేం ఆ మరుసటి రోజు (2018 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12)  నుంచి 2023 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9 వరకు ఐదేండ్లలో రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించాం.ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయి” అని వెల్లడించారు.  

బీఆర్ఎస్ మాట నిలబెట్టుకోలే..  

గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రెండుసార్లు చేసిన రుణమాఫీ మొత్తం రూ.28 వేల కోట్లు మాత్రమేనని రేవంత్ తెలిపారు. ‘‘బీఆర్ఎస్​హయాంలో మొదటిసారి 2014 మార్చి 31 వరకు కటాఫ్​ తేదీ పెట్టుకుని రూ.16 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఆ తర్వాత రెండోసారి 2018 డిసెంబర్ 11 వరకు కటాఫ్ పెట్టుకుని రూ.12 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. గత ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తామని, నాలుగు విడతల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి పూర్తిగా మాఫీ చేయకుండా రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. రైతులకు ఇచ్చిన మాటను బీఆర్ఎస్ నిలబెట్టుకోలేదు.

కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రుణమాఫీ పూర్తి చేసి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నది” అని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం వచ్చిన రెండు నెలలకే లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ రెండు, మూడు నెలలు కొనసాగింది. ఇప్పుడే పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాం” అని పేర్కొన్నారు. 

అర్హులకే రైతు భరోసా.. 

రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు, ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయిం చింది. దీనిపై విధివిధానాల కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జులై 15లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం.

- సీఎం రేవంత్​ రెడ్డి

ప్రభుత్వ సమాచార బాధ్యతలు ఇద్దరు మంత్రులకు.. 

మంత్రివర్గంలో తీసుకునే, పాలనాపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమని చెప్పారు. సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఈ ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా వార్తలు సృష్టిస్తున్నారని

అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ విధివిధానాలు, నిధుల సమీకరణపై మీడియా ప్రశ్నించగా.. ‘‘తినబోతూ రుచులెందుకు? రుణమాఫీ విధివిధానాలు త్వరలోనే వెల్లడిస్తాం. అమలుపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు” అని అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులందరూ పాల్గొన్నారు.