
- ఆ ప్రాజెక్టుతో తెలంగాణప్రయోజనాలకు ముప్పు
- కేంద్రం సానుకూలంగాస్పందించకపోతే సుప్రీంకు వెళ్తాం
- జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్కు తేల్చిచెప్పిన సీఎం రేవంత్
- జీడబ్ల్యూడీటీ, విభజన చట్టాలనుఏపీ ఖాతరు చేస్తలే
- కృష్ణాలో 500, గోదావరిలో 1,000 టీఎంసీలు వాడుకుంటాం
- ఇందుకోసం ఎన్వోసీ జారీ చేయండి
- అవసరమైతే ఇచ్చంపల్లి-– నాగార్జునసాగర్ లింక్పై చర్చిద్దాం
- పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం పనులు
- పాలమూరు, సమ్మక్క– సారక్క, తుమ్మిడిహెట్టికి నీటి కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి
- త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడ్తామని కేంద్ర మంత్రి చెప్పారు: మంత్రి ఉత్తమ్
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న గోదావరి – -బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, వెంటనే దాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలన్నారు. బనకచర్ల విషయంలో గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్-–1980 (జీడబ్ల్యూడీటీ), ఏపీ పునర్విభజన చట్టం–2014కు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్నదని ఆయన ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో తాము ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని, అన్ని వేదికల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రయత్నిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ స్పందన అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేంద్ర మంత్రికి సీఎం స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ మీటింగ్ జరిగింది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ, పర్యావరణ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతుల్లో ఆందోళనలు నెలకొన్నాయని పాటిల్ దృష్టికి సీఎం రేవంత్రెడ్డి తీసుకెళ్లారు. గోదావరి వరద జలాల ఆధారంగా బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నట్లు ఏపీ చెప్తున్నదని.. కానీ, జీడబ్ల్యూడీటీ-–1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలిపారు. విభజన చట్టం ప్రకారం నూతన ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటే ముందు ఆ నదీ యాజమాన్య బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), జలశక్తి మంత్రి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాల్సి ఉంటుందని సీఎం గుర్తు చేశారు. బనకచర్ల విషయంలో ఏపీ సర్కార్ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని కేంద్ర మంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘ఏ నిబంధనలు పాటించని ఏపీ.. వరద జలాల ఆధారంగా ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలి. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.
ఇచ్చంపల్లి – నాగార్జునసాగర్ లింక్పై చర్చిద్దాం
సీడబ్ల్యూసీ పరిధిలోని సాంకేతిక సలహా మండలి నుంచి అనుమతులు పొందకుండానే వరద జలాల పేరుతో పోలవరం కింద పురుషోత్తపట్నం, వెంకటనగరం, పట్టిసీమ, చింతలపూడి లిఫ్ట్ స్కీంలను ఏపీ చేపట్టిందని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. పోలవరం డిజైన్లలో ఏపీ మార్పు చేసిందని, పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పనులు చేపడుతున్నదని, దీనిపై తాము అభ్యంతరాలు లేవనెత్తినా పనులు మాత్రం కొనసాగిస్తూనే ఉందని ఆయన కంప్లైంట్ చేశారు. జాతీయ ప్రాజెక్టయిన పోలవరం విషయంలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. గోదావరిలో వరద జలాలున్నాయని నిజంగా ఏపీ భావిస్తుంటే పోలవరం, -బనకచర్లకు బదులు కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి-–నాగార్జునసాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయంలో చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 తీర్పు త్వరగా వెలువడేలా చూడాలని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
1,500 టీఎంసీలకు పర్మిషన్ ఇవ్వండి
తెలంగాణకు గోదావరి నదిలో 1000 టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీలు మొత్తంగా 1,500 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేయాలని కేంద్ర మంత్రి పాటిల్ను సీఎం రేవంత్రెడ్డి కోరారు. ఈ 1,500 టీఎంసీల నీటితో కోటిన్నర ఎకరాలకు నీరు అందుతుందని.. ఆ తర్వాత ఏపీ చేప్టటే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. ఏపీ సర్కార్ చేపడుతున్న ప్రాజెక్టుల అనుమతి ప్రక్రియలో స్పీడ్ గా వ్యవహరిస్తున్న కేంద్రం... తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడం ఏమిటని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇలాంటి వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని పాటిల్కు తెలియజేశారు. పాలమూరు–-రంగారెడ్డి, సమ్మక్క-–సారక్క, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులతోపాటు అన్ని రకాల పర్మిషన్లు వెంటనే మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రఘువీర్ రెడ్డి, ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, రాష్ట్ర నీటి పారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టుల సమన్వయ
కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
బనకచర్ల ప్రాజెక్టు.. చట్ట వ్యతిరేకం: ఉత్తమ్
బనకచర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమైందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జీడబ్ల్యూడీటీ-1980, ఏపీ విభజన చట్టాలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ ను ఏపీ నిర్మించాలని చూస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పాటిల్తో భేటీ అనంతరం సీఎం రేవంత్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉత్తమ్ తెలిపారు. ‘‘బనకచర్లకు సంబంధించిన డీపీఆర్ అందలేదని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎంలతో కలిసి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని చెప్పారు” అని వెల్లడించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తే సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. గంగా, యమునా నదుల ప్రక్షాళనకు నిధులిచ్చినట్లే మూసీ పునరుజ్జీవనానికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.