తెలంగాణకు అన్యాయం జరగొద్దు : చామల

తెలంగాణకు అన్యాయం జరగొద్దు : చామల
  • బనకచర్లపై కిషన్ రెడ్డి కంటే ముందే కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి: చామల  

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరగవద్దని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇప్పుడే నిద్రలేచి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు శాశ్వత నీటి కేటాయింపులు జరపాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బాధ్యత లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సహకరించాలని, పక్షపాతం చూపవద్దని కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని కేంద్ర మంత్రి శంకించవద్దని స్పష్టం చేశారు.