
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే డీఈఈసెట్–2025కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. మార్చి24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, ఈనెల 15తో ముగిసింది. మొత్తం 43,600 మంది అప్లై చేశారు. నిరుడు 17 వేలకు పైగా దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది రెండింతలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. కాగా, ఎస్జీటీ పోస్టులకు డీఈడీ అభ్యర్థులే అర్హులని 2023లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2023లో 6,485 దరఖాస్తులు వస్తే, 2024లో 17,655 అప్లికేషన్లు వచ్చాయి. తాజాగా 43,600 మందికి అప్లై చేశారు.
డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయనుండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మాత్రం ఖాళీగా ఉన్న వాటిలో 30 శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారు. దీంతో ఈ ఏడాది డీఈడీ కోర్సులకు మంచి డిమాండ్ నెలకొంది. అయితే, ఈనెల 25న డీఈఈసెట్ ఎగ్జామ్ జరగనుంది.