- గోవా, ముంబై,ఢిల్లీలో 132 మంది అరెస్ట్
- భారీగా డ్రగ్స్, మ్యూల్ అకౌంట్లు, హవాలా డబ్బు స్వాధీనం
- ఢిల్లీ, ముంబై, గోవా, బెంగళూర్ సిటీల్లో కింగ్ పిన్స్ మకాం
- లోకల్ పెడ్లర్లు, హవాలా ఏజెంట్లు, కొరియర్ ద్వారా సప్లయ్
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ మాఫియాపై రాష్ట్ర ఈగల్ ఫోర్స్ మెరుపు దాడులు చేస్తోంది. డ్రగ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారిన నైజీరియన్లు సహా దేశంలోని డ్రగ్స్, గంజాయి స్మగ్లర్లపై సర్జికల్ స్ట్రైక్ లు నిర్వహిస్తోంది. గోవా, ఢిల్లీ, ముంబై, బెంగళూర్ సిటీల్లో “ఆపరేషన్ డ్రగ్ కింగ్ పిన్స్” పేరుతో సెర్చ్ దాడులు చేస్తూ.. డ్రగ్స్ ముఠాల మూలాలను పెకిలించివేస్తోంది.
ఇందుకోసం ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా సైతం స్వయంగా రంగంలోకి దిగారు. గోవా, తదితర చోట్ల మారువేశాల్లో తిరుగుతూ డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇలా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గోవాలో డ్రగ్స్, హవాలా గ్యాంగ్స్, ముంబైలో మ్యూల్ అకౌంట్ల ముఠాలు, ఢిల్లీలో నైజీరియన్ల అక్రమ దందాల గుట్టును రట్టు చేశారు. గత మూడు నెలల వ్యవధిలో మూడు ఆపరేషన్లు చేసి132 మందిని అరెస్ట్ చేశారు.
కస్టమర్ల నుంచి కింగ్ పిన్స్ దాకా సిండికేట్లు..
ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిన డ్రగ్స్ దందాలో ఏజెంట్లు కింగ్పిన్స్గా, కస్టమర్లు సప్లయర్లుగా మారుతున్నారు. దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేందుకు గోవా, ఢిల్లీ, ముంబై, బెంగళూర్లో డ్రగ్స్ డీలర్లు, కింగ్ పిన్స్ మకాం వేస్తున్నారు. అందుకే డ్రగ్స్ సప్లయర్లు, కస్టమర్లు మినహా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కింగ్పిన్స్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త వారితో, సరికొత్త మార్గాల్లో సరుకును మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని మెయిన్ కింగ్ పిన్స్, సప్లయర్లపై ఈగల్ వరుస ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
గోవా కాటేజీల్లో సెక్స్ వర్కర్లతో డ్రగ్స్ ట్రాప్
గోవా పబ్బుల్లో పని చేస్తున్న కొంతమంది డీజేలు, ఇతర సిబ్బంది నైజీరియన్లతో కలిసి కొకైన్, సింథటిక్ డ్రగ్స్ను సప్లయ్ చేస్తున్నారు. టారిస్టులను తమ కస్టమర్లుగా మార్చుకుంటున్నారు. సెక్స్ వర్కర్లతో యువతను ట్రాప్ చేస్తున్నారు. కాటేజీలకు డ్రగ్స్ సప్లయ్ చేస్తూ.. అందినంత దోచేస్తున్నారు. ఇలా మత్తుకు బానిసలైన కస్టమర్లు దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఆర్డర్లపై డ్రగ్స్ పార్సిల్ చేస్తున్నారు. గోవా పర్రాలోని నలుగురు నైజీరియన్ల ముఠా వద్ద హైదరాబాద్, బెంగళూరు, కేరళకు చెందిన 40 మంది కస్టమర్లు రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేసేవారు.
నైజీరియన్ల డ్రగ్స్ నెట్వర్క్లో హవాలా రాకెట్
నైజీరియన్ల డ్రగ్స్ దందాలో హవాలా ఏజెంట్లు కీలకంగా మారారు. మాదకద్రవ్యాల అమ్మకాలతో సంపాదించిన సొమ్మును నైజీరియాకు తరలించడంతో పాటు పోలీసులకు చిక్కిన సప్లయర్లకు బెయిల్ సహా ఇతర అవసరాల కోసం డబ్బును సమకూర్చుతున్నారు. ఇలాంటిదే గోవా పర్రా, అంజున ప్రాంతాల్లోని హైలాండ్ పార్క్ అపార్ట్మెంట్, సంగీత మొబైల్ షాప్లో సహా కొందరు వ్యాపారులు హవాలా చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించి, జూన్లో దాడులు చేసింది.
నైజీరియాకు తరలించేందుకు సిద్ధం చేసిన రూ.50 లక్షలు సీజ్ చేసింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును హవాలా రూపంలో మనీలాండరింగ్ చేస్తున్నట్లు గుర్తించింది. ఢిల్లీ ఆపరేషన్లో ఈగల్కు చిక్కిన బద్రుద్దీన్, అతని సహచరుడు గార్మెంట్స్ బిజినెస్ పేరుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్నారని.. ఆరు మ్యూల్ ఖాతాలలో రూ.15 కోట్లు లావాదేవీలు నిర్వహించినట్టు తేల్చారు.
సప్లయ్ చైన్ను తెంచేయాలి
డ్రగ్స్ కంజ్యూమర్లను పట్టుకుంటే సరిపోదు. సప్లయ్ చైన్ను తెంచేయాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్ మాఫియా డేటా మా దగ్గర ఉంది. దేశంలోని డ్రగ్స్ ముఠాల మూలాలపై దాడులు చేస్తున్నాం. గోవా, ముంబైలోని హవాలా వ్యాపారులు, మ్యూల్ ఖాతాలపై నిఘా పెంచాం.
హైదరాబాద్ కస్టమర్లు అంటే డ్రగ్స్ సప్లయర్స్లో భయం నెలకొంది. అయినప్పటికీ డిమాండ్ తగ్గితే తప్ప మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట పడే అవకాశాలు లేవు. అందుకే మెయిన్ కింగ్ పిన్స్ మూలాలు, చైన్ సిస్టమ్లో చివరి లింక్ లొకేషన్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నాం. డ్రగ్స్పై సర్జికల్ స్ట్రైక్ రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుంది.
- సందీప్ శాండిల్యా, డైరెక్టర్, టీజీ ఈగల్ ఫోర్స్
