ఒక్కొక్కరికి మూడు నిమిషాలే.. డీసీసీ అధ్యక్షులతో మురళీధరన్ భేటీ

ఒక్కొక్కరికి మూడు నిమిషాలే.. డీసీసీ అధ్యక్షులతో మురళీధరన్ భేటీ
  •     వారి నుంచి ఫీడ్ బ్యాక్, అభ్యంతరాల స్వీకరణ
  •     స్పెషల్ కేటగి కింద సీటు ఇవ్వాలని పలువురి విజ్ఞప్తులు

హైదరాబాద్, వెలుగు: అభ్యర్థుల లిస్ట్​పై డీసీసీ అధ్యక్షులతో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ మంగళవారం వన్ టు వన్ సమావేశం నిర్వహించారు. దాంతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక విధివిధానాలపై అభిప్రాయాలను తీసుకున్నారు. తొలుత ఏఐసీసీ కార్యదర్శులు, మాజీ మంత్రులతో సమావేశమై వారి నుంచి అభ్యర్థుల గురించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్టు తెలిసింది. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందో వారి నుంచి సమాచారం తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు డీసీసీలతో సమావేశమైన ఆయన.. వారి పర్సనల్ వివరాలతో పాటు.. వారి వారి జిల్లాల నుంచి అప్లై చేసుకున్న వారి వివరాలను ఆరా తీసినట్టు సమాచారం. జానారెడ్డి, చిన్నారెడ్డి తదితరులు మురళీధరన్​తో భేటీ అయినవారిలో ఉన్నారు.

అభ్యంతరాలుంటే చెప్పండి

జిల్లా అధ్యక్షులతో భేటీ సందర్భంగా ఒక్కో డీసీసీ ప్రెసిడెంట్ కు గరిష్టంగా మూడు నిమిషాల టైంను మాత్రమే మురళీధరన్ కేటాయించారు. ఆ మూడు నిమిషాల్లోనే వారి జిల్లాల్లోని అభ్యర్థుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థికే టికెట్ ఎందుకివ్వాలి? డీసీసీ అధ్యక్షులు అప్లై చేసుకుంటే.. వారికి టికెట్ ఎందుకివ్వాలో చెప్పాలంటూ ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. కేవలం ఈ మూడు నిమిషాల టైంలోనే చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి రావడంతో..  ఏం చెప్పాలో అర్థంకాక గందరగోళంలో పడినట్టు తెలిసింది. ఎవరి మీదైనా అభ్యంతరాలుంటే.. చెప్పాల్సిందిగా మురళీధరన్ అడిగినట్టు తెలిసింది.

టికెట్ల కోసం విద్యార్థి నేతల వినతులు

చాలా మంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్లలో ఆశావహులు టికెట్ల కోసం నేరుగా మురళీధరన్​కే వినతులు సమర్పిస్తున్నారు.  పాలకుర్తి నియోజకవర్గం టికెట్ ఇప్పించాల్సిందిగా మంగళవారం ఎన్నారై తిరుపతి రెడ్డి మురళీధరన్​ను కోరారు. ఇటు ఎన్ఎస్​యూఐ విద్యార్థి నేత బైకాని లింగం యాదవ్.. తనకు మునుగోడు టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. పాలేరు సీటు కేటాయించాలని పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. కాగా, బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది.