ఒక రాష్ట్ర అభివృద్ధికి నిజమైన కొలమానం ఆ రాష్ట్ర రైతు సంక్షేమమే. రైతు సంతోషంగా ఉన్నచోటే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలపడుతుంది. గ్రామీణ ఆర్థికవ్యవస్థ పటిష్టమైతేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ వాస్తవాన్ని ఆచరణలో సాక్షాత్కరింపజేస్తూ తెలంగాణ నేడు దేశ వ్యవసాయ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకప్పుడు కరవు, సాగునీటి కొరత, మార్కెట్ అనిశ్చితి, రైతు ఆత్మవిశ్వాస సంక్షోభానికి ప్రతీకగా నిలిచిన ఈ నేల... నేడు దేశ ఆహార భద్రతకు భరోసాగా, కోట్లాది ప్రజల అన్నపూర్ణగా అవతరించడం విశేషం. రికార్డు స్థాయి ధాన్యం ఉత్పత్తి, విస్తృత కొనుగోలు వ్యవస్థ, రైతుల ఖాతాల్లో సకాలంలో జమవుతున్న వేల కోట్ల రూపాయలు, రైతు కేంద్రిత పరిపాలన తెలంగాణను ‘భారతదేశపు అన్నపూర్ణ’గా నిలబెట్టాయి.
2025-–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 150 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఒక సాధారణ గణాంకాల పరిణామం కాదు. ఇది రైతు శ్రమకు లభించిన గౌరవానికి ప్రతీక. 26.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లను నేరుగా జమ చేయడం వ్యవసాయ రంగంపై ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేస్తోంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం ఎంత ముఖ్యమో, ఆ మొత్తాన్ని సకాలంలో అందించడం కూడా అంతే కీలకం. వ్యవసాయ రంగంలో అత్యంత కీలకమైన అంశం మార్కెట్ భరోసా. పంట పండించిన తర్వాత దాన్ని విక్రయించేందుకు రైతుపడే ఇబ్బందులు గతంలో తీవ్రంగా ఉండేవి. మార్కెట్ యార్డుల వద్ద రోజులు తరబడి వేచి ఉండటం, తూకాల్లో అవకతవకలు, మధ్యవర్తుల దోపిడీ, చెల్లింపుల జాప్యం రైతులను ఆర్థికంగా నష్టపరిచేవి. అయితే తెలంగాణలో పరిస్థితి గణనీయంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ మార్పుకు నిదర్శనం.
రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు
ఈ కొనుగోలు కేంద్రాల వల్ల మధ్యవర్తుల ప్రమేయం క్రమంగా తగ్గిపోయింది. ముఖ్యంగా కొనుగోలు చేసిన ధాన్యానికి 48 నుంచి 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జమ కావడం వ్యవసాయ రంగంపై రైతుల్లో విశ్వాసాన్ని మరింత పెంచింది. రైతు కష్టానికి తక్షణ ప్రతిఫలం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ విధానాల్లో కేంద్రబిందువుగా నిలబెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు
ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు. తెలంగాణ వ్యవసాయ రంగంలో గత కొన్నేళ్లుగా జరిగిన మౌలిక మార్పుల ఫలితమే ఇది. సాగునీటి వసతుల విస్తరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యుత్ సరఫరా, మార్కెట్ సదుపాయాల మెరుగుదల, సాంకేతికత వినియోగం వంటి అనేక అంశాలు కలిసి ఈ విజయానికి బలమైన పునాది వేశాయి. వ్యవసాయ రంగంలో పురోగతి కేవలం రైతులకే పరిమితం కాదు. రైతుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయలు చేరడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పు వస్తోంది. గ్రామీణ మార్కెట్లలో కొనుగోలు శక్తి పెరుగుతోంది. చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయి. రైతు ఆదాయం పెరగడం అంటే కేవలం ఒక కుటుంబం ఆర్థికంగా బలపడడం కాదు. దాని ప్రభావం మొత్తం గ్రామీణ సమాజంపై పడుతుంది.
పంటల వైవిధ్యంపై దృష్టి సారించాలి
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగంలో మరిన్ని సంస్కరణలు అవసరం. ప్రస్తుతం వరి సాగు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ప్రధాన ఆధారంగా ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు, నీటి వనరులపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో పంటల వైవిధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తక్కువ నీటి అవసరం ఉన్న పంటలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యానవన పంటలను ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని మరింత స్థిరంగా మార్చవచ్చు.
అదేవిధంగా వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం కాలానుగుణ అవసరం. రైతు కేవలం ముడి ఉత్పత్తిని విక్రయించకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో భాగస్వామి అయితే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నిల్వ సామర్థ్యాల పెంపు, శీతల గిడ్డంగుల ఏర్పాటు, ఎగుమతి అవకాశాల విస్తరణ, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతం వంటి అంశాలు భవిష్యత్తు వ్యవసాయాభివృద్ధికి కీలకం కానున్నాయి. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో తెలంగాణ చూపిస్తున్న దారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. రైతు సంక్షేమాన్ని అభివృద్ధి ఎజెండాలో ప్రధాన స్థానంలో ఉంచినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో ఈ రికార్డుస్థాయి ధాన్యం కొనుగోళ్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
రైతు సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
తెలంగాణ నేడు సాధించిన ఈ విజయాల వెనుక లక్షలాది మంది రైతుల చెమట ఉంది. ఆ శ్రమకు తగిన గౌరవం కల్పించే పరిపాలన ఉంది. రైతు పండించిన ప్రతి గింజకు విలువ కల్పించాలన్న సంకల్పం ఉంది. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ బాధ్యతగా భావించే రాజకీయ చిత్తశుద్ధి ఉంది. అందుకే తెలంగాణ కేవలం ఒక రాష్ట్రంగా కాకుండా దేశ ఆహార భద్రతకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇదే దిశలో ప్రభుత్వం మరింత ముందుకుసాగితే తెలంగాణ దేశానికి అన్నంపెట్టే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, రైతు సంక్షేమానికి జాతీయ ఆదర్శంగా కూడా నిలుస్తుంది.
- సంగిశెట్టి జగదీశ్వరరావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
